
ధోని మూవీలో అభిమానులను అలరించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సుశాంత్ ఊహించని రీతిలో మృతి చెందారు. నేటికి సుశాంత్ మనకు దూరమై ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సుశాంత్ను గుర్తు చేసుకున్న అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తనను చాలా మిస్సవుతున్నట్లు రాసుకొచ్చింది. భౌతికంగా మీరు లేకపోయినా మాతో పాటు అభిమానుల గుండెల్లో నిలిచి ఉన్నారంటూ ఎమోషనలైంది.
శ్వేత ఇన్స్టాలో రాస్తూ..' మా అన్న జూన్ 14, 2020న ఈ లోక విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు సీబీఐ కోర్టుకు ఒక నివేదికను సమర్పించింది. దాని కోసం మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న ఏమిటంటే.. ఏమి జరిగినా దేవునిపై విశ్వాసం కోల్పోకండి. మన సుశాంత్ జీవితాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అతని చిరునవ్వు, చిన్నపిల్లవాడిలాంటి అమాయకత్వం ఎవరి హృదయాన్నైనా ప్రేమతో కదిలించగలదు. మన సుశాంత్ దేనికోసం నిలబడ్డారో.. మనం దానికోసం నిలబడాలి' అంటూ రాసుకొచ్చింది.
'భాయ్ ఎక్కడికీ వెళ్లలేదు. అతను మీలో, నాలో, మనందరిలోనే ఉన్నాడు. మనం మరింత నేర్చుకోవాలనుకునే ప్రతిసారీ అతన్ని గుర్తు చేసుకుందాం. అతనికి ఇష్టం లేని నెగెటివ్ భావనను వ్యాప్తి చేయడానికి భాయ్ పేరును ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఎందుకంటే సుశాంత్ దాని కోసం నిలబడలేదు. భాయ్ ఎంత మంది హృదయాలను ప్రభావితం చేశాడో చూడండి. అన్న పేరును నిలిచిపోయేలా చేయండి.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
కాగా.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న ముంబైలోని తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాపు. ఆ తర్వాత కొందరు ఆత్మహత్యగా భావించారు. కానీ ఆయన కుటుంబం న్యాయం కోసం ఇప్పటికీ పోరాడుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దాదాపు ఐదేళ్ల తర్వాత.. ఆరోపణలను నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంటూ సీబీఐ నివేదికను కోర్టుకు సమర్పించింది.