సుశాంత్‌ హౌస్‌ కీపర్‌ స్టేట్‌మెంట్‌.. ఆసక్తికర అంశాలు వెల్లడి

Sushant Singh Rajput Servant Said What Happened on June 14 - Sakshi

ఆ రోజు ఉదయం 9.30 గంటలకు సుశాంత్‌ జ్యూస్‌, కొబ్బరి నీరు తాగారు

10.30 గంటలకు రూమ్‌ లోపలి నుంచి లాక్‌

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై పోలీసుల విచారణలో సుశాంత్‌ హౌస్‌కీపర్‌ నీరజ్‌ సింగ్‌ కీలకాంశాలు వెల్లడించాడు. అసలు జూన్‌ 14న ఏం జరగింది అనే దాని గురించి నీరజ్‌ సింగ్‌ మాటల్లోనే.. ‘రోజులానే ఆ రోజు(జూన్‌ 14) నేను ఉదయం 6.30 గంటలకి లేచాను. ఆ తర్వాత కుక్కలను బయటకు తీసుకెళ్లాను. 8 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాను. ఆ తర్వాత గదులు, మెట్లు శుభ్రం చేశాను. ఇంతలో సుశాంత్‌ సార్‌ తన గది నుంచి వచ్చి చల్లటి నీరు అడిగారు. తీసుకెళ్లి ఇచ్చాను. వాటర్‌ తాగి హాల్‌ శుభ్రం చేశావా అని నన్ను ప్రశ్నించి.. నవ్వుతూ తన గదిలోకి వెళ్లారు. ఆ తరువాత, ఉదయం 9:30 గంటలకు, నేను హాల్ శుభ్రం చేస్తున్నప్పుడు, కేశవ్ (కుక్) అరటిపండ్లు, కొబ్బరి నీళ్ళు, జ్యూస్‌ తీసుకుని సార్ గదిలోకి వెళ్లడం చూశాను. కేశవ్ తిరిగి వచ్చి, సార్ కొబ్బరి నీళ్ళు, జ్యూస్‌ మాత్రమే తీసుకున్నారని చెప్పాడు’ అని తెలిపాడు నీరజ్‌. 

10.30 గంటల ప్రాంతంలో డోర్‌ లాక్‌
ఆ తర్వాత ‘ఉదయం 10:30 గంటలకు, మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలో తెలుసుకునేందుకు కేశవ్ మళ్ళీ సార్ గదికి వెళ్లాడు. అతను తలుపు తట్టాడు కాని గది లోపలి నుంచి లాక్ చేసి ఉంది.. ఎటువంటి స్పందన లేదు. దాంతో కేశవ్‌ సార్ నిద్రపోతున్నాడని భావించి కిందకు వచ్చాడు. ఈ విషయాన్ని దీపేశ్, సిద్ధార్థ్‌లకు చెప్పాడు. వారు కూడా గదికి వెళ్లి తలుపు మీద కొట్టడం ప్రారంభించారు. వారు చాలా సేపు తలుపు తట్టారు కాని లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో దీపేశ్ దిగి వచ్చి దాని గురించి నాకు చెప్పాడు. నేను కూడా సార్ గదికి వెళ్లి తలుపు తట్టాను కానీ తెరవ లేదు. ఇంతలో సిద్ధార్థ్, సార్ ఫోన్‌కి కాల్‌ చేశాడు. కాని సార్ రూమ్ డోర్ తెరవలేదు.. ఫోన్‌కు సమాధానం ఇవ్వలేదు. మేము గది తాళం కోసం వెతకడం ప్రారంభించాము. అయితే అప్పుడు అవి మాకు దొరకలేదు. దాంతో దీని గురించి సుశాంత్‌ సోదరి మీతు దీదీకి చెప్పాం. ఆమె తాను బయలుదేరానని.. గది తలుపులు తెరవమని మాకు చెప్పారు’ అన్నాడు నీరజ్‌. (సుశాంత్‌ కేసు: కీలక సాక్షుల విచారణ)

తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాం..
‘తాళం తీయడానికి సిద్ధార్థ్ ఒక కీ మేకర్‌ను పిలిచాడు. వాళ్లు వచ్చారు కాని వారు ఎక్కువ సమయం తీసుకుంటున్నందున వారిని వెంటనే పంపేశారు. ఆ తరర్వాత మిగతా పనివారి సాయంతో తలుపులు పగలగొట్టి గదిలోకి ప్రవేశించారు. అప్పుడు గదిలో చీకటిగా ఉంది, ఏసీ ఆన్‌లోనే ఉంది. దీపేశ్ లైట్ ఆన్ చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ లోపలకు వెళ్లి వెంటనే బయటకు వచ్చాడు. అతని వెనుక, నేను లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత సుశాంత్ సోదరి మీతు వచ్చారు. రాగానే‘ గుల్షన్ తూనే యే క్యా కియా ’అని అరవడం ప్రారంభించారు.  ఆ తర్వాత పోలీసులను పిలిచారు’ అని తెలిపాడు నీరజ్‌. (అలా బ‌య‌ట‌కు క‌నిపిస్తారా?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top