ఇండస్ట్రీలో చాలామంది హీరోలు గానీ నటీనటులు రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే భార్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆమెతో పెద్దగా సంబంధాలు ఉండవు. కలిసే, మాట్లాడే లాంటివి కూడా ఉండకపోవచ్చు. కానీ తమిళ నటుడు శరత్ కుమార్ మాత్రం వీటన్నింటికీ అతీతుడులానే కనిపిస్తున్నాడు. తాజాగా ఇతడి మొదటి భార్య ఛాయాదేవి.. రెండో భార్య అయిన రాధికని ప్రశంసలతో ముంచెత్తించారు.
(ఇదీ చదవండి: హీరో విజయ్ను అన్ఫాలో కొట్టిన కుమారుడు!)
ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ప్రధాన పాత్ర పోషించి, తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా 'సరస్వతి'. థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. ఈ శుక్రవారమే(మార్చి 06) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం మధ్యాహ్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వరలక్ష్మి తల్లి, శరత్ కుమార్ మొదటి భార్య ఛాయాదేవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'తొలినాళ్లలో దూరదర్శన్లో యాంకర్గా పనిచేశాను. ఓసారి రాధికని ఇంటర్వ్యూ చేశాను. దీపావళి సందర్భంగా అది రిలీజైంది. కుటుంబానికి అండగా నిలబడినందుకు థ్యాంక్స్. అలానే 'థాయ్ కెలవి' మూవీ హిట్ అయినందుకు శుభాకాంక్షలు. అందులో మీరు యాక్టింగ్ అద్భుతంగా చేశారు' అని ఛాయాదేవి.. రాధికని ప్రశంసలతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నటుడు శరత్ కుమార్.. ఛాయాదేవిని 1984లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు వరలక్ష్మి, పూజా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2000లో ఈమెకు విడాకులు ఇచ్చేసిన శరత్ కుమార్.. తర్వాత ఏడాది నటి రాధికని వివాహమాడాడు. వీళ్లకు రాహుల్ అనే కొడుకు పుట్టాడు. ఛాయాదేవి ప్రస్తుతం శరతు కుమార్తో కలిసి ఉండట్లేదు. కాకపోతే వరలక్ష్మి మాత్రం రాధికతో మంచి బాండింగ్ మెంటైన్ చేస్తోంది. వరలక్ష్మి పెళ్లి కూడా రాధికనే దగ్గరుండి జరిపించింది.
(ఇదీ చదవండి: నచ్చినవాడితో జీవితం పంచుకుంటా.. త్రిష ఓల్డ్ కామెంట్స్ వైరల్)


