Producer Dil Raju Announced Movie Shooting Starts From September 1st - Sakshi
Sakshi News home page

Tollywood Movie Shootings: ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ కీలక నిర్ణయం, షూటింగ్స్‌ పున:ప్రారంభంపై ప్రకటన

Aug 23 2022 6:54 PM | Updated on Aug 24 2022 3:21 AM

Producer Dil Raju Announced Movie Shooting Starts From September 1st - Sakshi

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దిల్‌ రాజు

‘‘చిత్రపరిశ్రమలోని సమస్యలు పరిష్కరించడానికి షూటింగ్స్‌ నిలిపివేసినప్పటి నుంచి పలు సమావేశాలు ఏర్పాటు చేసి, చర్చించాం. ఇందులో భాగంగా అందర్నీ సమన్వయ   పరచడానికి ఎగ్జిబిటర్స్, నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్‌తో పాటు 24 క్రాఫ్ట్స్‌కు చెందిన యూనియన్స్, కౌన్సిల్స్‌తో చర్చించాం. సెప్టెంబర్‌ 1నుంచి యథావిధిగా షూటింగ్స్‌ చేసుకోవచ్చనే నిర్ణయానికి వచ్చాం’’ అని ‘దిల్‌’ రాజు అన్నారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆగస్ట్‌ 1నుంచి షూటింగ్‌లు నిలిపివేసిన విషయం విదితమే. సెప్టెంబర్‌ 1నుంచి షూటింగ్స్‌ పునః ప్రారంభించుకోవచ్చని మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాతలు వెల్లడించారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లో 1800 థియేటర్లు ఉన్నాయి. వీపీఎఫ్‌ చార్జీల విషయంలో క్యూబ్, యూఎఫ్‌ఓలతో సంప్రదించి, అగ్రిమెంట్‌ విధానంలో నిర్ణయాలను తీసుకున్నాం. అలాగే టికెట్స్, తినుబండారాలు వంటివాటి ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి. పెద్ద సినిమాలకు బడ్జెట్‌ బట్టి టికెట్‌ ధరలను పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. మరికొన్ని క్రాఫ్ట్స్‌తో చర్చించి ఈ నెల 30న పూర్తి విషయాలను వెల్లడిస్తాం’’ అన్నారు. సి. కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘ముందుగా షూటింగ్స్‌ ప్రారంభించాలనుకునేవారు ఫిల్మ్‌ చాంబర్‌ను సంప్రదిస్తే ఈ నెల 25 నుంచి అనుమతులు ఇస్తాం’’ అన్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement