అక్క టాలీవుడ్.. చెల్లి కోలీవుడ్.. ఎంట్రీ అదిరిపోయింది! | Khushi Kapoor Entry Into Kollywood Debut With young Hero | Sakshi
Sakshi News home page

Khushi Kapoor: అక్క టాలీవుడ్.. చెల్లి కోలీవుడ్.. పోటీ పడుతున్న సిస్టర్స్!

Nov 19 2023 11:22 AM | Updated on Nov 19 2023 11:47 AM

Khushi Kapoor Entry Into Kollywood Debut With young Hero - Sakshi

అతిలోక సుందరిగా సీనీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి. ఆమె తన సినీ కెరీర్‌లో నాలుగేళ్ల వయసులోనే తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కందన్‌ కరుణై అనే చిత్రంతో శుభారంభం జరిగింది. అది మొదలుకుని ఐదు దశాబ్దాల పాటు బాలనటి స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ కథానాయకి వరకు శ్రీదేవి నటన ఎదిగింది. బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లి చేసుకున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా.. వారిద్దరూ శ్రీదేవికి వారసులుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ దఢక్‌ అనే హిందీ చిత్రంలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి వరుసగా చిత్రాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ సరసన దేవర చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. 

మరోవైపు శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ సైతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె కూడా తన అక్క బాటలోనే ది ఆర్చీస్‌ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయమైంది. అయితే ఈ చిత్రం థియేటర్‌లో కాకుండా నెట్‌ఫిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. కాగా ఖుషీ కపూర్‌ నటించిన తొలి చిత్రం ఇంకా తెరపైకి రాకుండానే కోలీవుడ్‌లో నటించే హీరోయిన్ ఛాన్స్ తలుపు తట్టిందని సమాచారం.

యంగ్ హీరో అధర్వకు జంటగా నటించడానికి ఖుషీ కపూర్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఆకాష్‌ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించనుందని తెలిసింది. దీనికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించనున్నారు. కాగా దక్షిణాదిలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్‌ తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇవ్వగా.. చిన్న కూతురు ఖుషీ కపూర్‌ తమిళ చిత్రంతో పరిచయం కాబోతుందన్నమాట.
 

Advertisement
 
Advertisement
Advertisement