డబ్బుల కోసం కోర్టుకు వెళ్లిన నటుడు దర్శన్ | Kannada Actor Darshan Appeal Court For His Money | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసం కోర్టుకు వెళ్లిన నటుడు దర్శన్

Jan 21 2025 11:53 AM | Updated on Jan 21 2025 12:51 PM

Kannada Actor Darshan Appeal Court For His Money

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో నటుడు దర్శన్‌కు(Darshan)  బెయిలు రావడంతో ప్రస్తుతం ఆయన తన కెరీర్‌పైన దృష్టి పెట్టారు. పలు సినిమాల్లో నటించిందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తన డబ్బు కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. రేణుకాస్వామి హత్య తర్వాత చాలా సమస్యల్లో ఆయన చిక్కుకున్నారు. ఈ కేసు విషయంలో తనకు సంబంధించిన రూ. 37 లక్షల డబ్బును పోలీసులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

( ఇదీ చదవండి: గతేడాదిలో పెళ్లి.. గుడ్‌ న్యూస్‌ చెప్పిన కిరణ్ అబ్బవరం)

గత ఏడాది జూన్‌లో జరిగిన రేణుకాస్వామి హత్య కేసు నుంచి దర్శన్‌ బయటపడేందుకు పవన్‌, నిఖిల్‌ అనే వ్యక్తులను సంప్రదించి ఈ కేసును వారిపై వేసుకోవాలని కోరినట్లు విచారణలో తేలింది. అందుకోసం మొత్తం నలుగురికి కలిపి రూ. 37 లక్షలు దర్శన్‌ ఇచ్చినట్లు పోలీసులు అనుమానించారు. పవన్‌ తన ఇంట్లో దాచి ఉంచిన ఆ డబ్బును బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దర్శన్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుతూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.

హత్య కేసులో నిందితుడు కావడంతో దర్శన్ తుపాకీ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. అందుకే గన్ లైసెన్స్ రద్దు చేయవద్దని దర్శన్ పోలీసు శాఖకు లేఖ రాశారు. తుపాకీ లైసెన్స్‌కు సంబంధించి పోలీసు శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అందుకే దర్శన్ విజ్ఞప్తి లేఖ రాశాడు. ఈ విషయం గురించి దర్శన్ మాట్లాడుతూ.. 'నేను సెలబ్రిటీని కావడంతో ఎక్కడికి వెళ్లినా చాలా మంది గుమిగూడుతుంటారు. ఈ క్రమంలో నాకు రక్షణ అవసరం. వ్యక్తిగత కారణాలతో నాకు గన్ లైసెన్స్ కావాలి. లైసెన్స్ రద్దు చేయవద్దు. నాపై నమోదైన కేసులో సాక్షులను ఇప్పటి వరకు ఎక్కడా నేను బెదిరించలేదు. అలా జరిగితే నాపై చట్టపరమైన చర్యలు తీసుకోండి.' అంటూ  లేఖలో ఆయన పేర్కొన్నారు.

బెయిలు రద్దు చేయాలని కోర్టును కోరిన పోలీసులు
రేణుకాస్వామి హత్య కేసులో  దర్శన్‌కు ఇచ్చిన బెయిలు రద్దు చేయాలని కోరుతూ   న్యాయస్థానంలో పోలీసులు అర్జీ దాఖలు చేశారు. వెన్నునొప్పికి శస్త్రచికిత్స అత్యవసరమని ఆరు వారాలు బెయిలు తీసుకుని బయటకు వచ్చిన ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారని కోర్టుకు తెలిపారు. కొద్దిరోజులుగా మైసూరు ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకున్న దర్శన్‌.. మళ్లీ సినిమాల్లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

త్వరలో ‘డెవిల్’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. దర్శన్‌తో పాటు పవిత్రా గౌడ, అనుకుమార్, లక్ష్మణ్, ప్రదోశ్, జగదీశ్‌లకు ఇచ్చిన బెయిలు కూడా రద్దు చేయాలని న్యాయవాది అనిల్‌ సి.నిశానితో పోలీసులు అర్జీ వేయించారు. మరో వారంలోపు ఈ అర్జీ విచారణకు వస్తుందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement