
ముంబై: గత కొన్నేళ్లుగా సౌత్ మూవీలకు బాలీవుడ్లో గిరాకీ బాగా పెరిగింది. దక్షిణాది సినిమాలను బీ-టౌన్లో రీమేక్ చేస్తూ నిర్మాతలు లాభాలు గడిస్తున్నారు. ముఖ్యంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ వంటి స్టార్లు తెలుగు కథలను బాలీవుడ్కు తీసుకువెళ్లి హిట్లు కొట్టి సత్తా చాటుతున్నారు. రెడీ, పోకిరి, కిక్ వంటి సినిమాలతో సల్మాన్ బాక్సాఫీస్ను షేక్ చేయగా.. అర్జున్ రెడ్డితో కబీర్ సింగ్గా చెరగని ముద్ర వేసిన షాహిద్.. నాని ‘జెర్సీ’ రీమేక్తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు.
ఈ క్రమంలో బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా ఖ్యాతిగడించిన ప్రభాస్ బ్లాక్బస్టర్ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త ఫిల్మీ దునియాలో షికారు చేస్తోంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు నిర్మాత ఎస్ తౌరానీ నిర్ణయించుకున్నారట. (చదవండి: ఛత్రపతి రీమేక్లో సాయి శ్రీనివాస్)
ఇందుకు సంబంధించి స్క్రిప్టు కూడా సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మాతృకలో పలు మార్పులు చేసి 2021 ఆరంభంలో సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్- తమన్నా జంటగా రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తప్పకుండా ఆడియెన్స్ను అలరిస్తుందనే నమ్మకంతోనే ఊసరవెళ్లి విడుదలై పదేళ్లు దగ్గరపడుతున్నా రీమేక్ చేసేందుకు తౌరానీ సిద్ధపడినట్లు బీ-టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక తారక్ ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.