రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాలతో నిన్న(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. రామ్ చరణ్ నటన, మేకింగ్, రెహమాన్ సంగీతంపై ప్రశంసలు కురిపించినప్పటికీ.. కథనం, జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వచ్చాయి. దేవర మాదిరే పెద్దిలోనూ జాన్వీ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. పలు సినిమా వెబ్సైట్స్ కూడా తమ రివ్యూల్లో జాన్వీ పాత్ర గురించి నెగెటివ్గానే రాసుకొచ్చాయి. అయితే తన గురించి నెగెటివ్గా రాస్తూ ఇన్స్టాలో పెట్టిన ఓ రివ్యూ పేజీని జాన్వీ కపూర్ లైక్ చేయడమే ఇప్పుడు విమర్శకులకు దారి తీసింది.
(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)
‘పెద్ది: భారతీయ సినీ చరిత్రలో ఒక హీరోయిన్కి జరిగిన అత్యంత అవమానం’ అని హెడ్డింగ్తో రాసి ఉన్న ఓ రివ్యూ పేజీని జాన్వీ కపూర్ లైక్ కొట్టడంతో అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. విమర్శిస్తూ రాసిన రివ్యూను లైక్ చేసిందంటే.. తన పాత్రకు ప్రాధాన్యత లేదనే విషయాన్ని జాన్వీ కపూర్ కూడా ఒప్పుకుందంటూ కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తే.. మరికొంత మంది ఏమో పొరపాటును ఆమె లైక్ కొట్టిందేమోనని భావిస్తున్నారు. మొత్తంగా ఈ పోస్ట్ వైరల్ కావడం.. పెద్దిపై విమర్శలు రావడంతో జాన్వీ ఆ పోస్ట్ను అన్లైక్ చేసింది. అయితే ఈ లోపే ఆమె లైక్ కొట్టిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్గా మారాయి.

కాగా, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రలో కనిపించింది. అయితే అసలు కథలు ఆమె పాత్రకు సంబంధమే ఉండదు. నిడివి కూడా తక్కువే ఉంటుంది. నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అందుకే జాన్వీ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. ఇక పెద్ది విషయానికొస్తే..టాక్తో సంబంధం లేకుండా తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


