Jai Bhim Vanniyar Issue: వివాదంలో సూర్య దంపతులు.. ఎఫ్‌ఐఆర్‌కు కోర్టు ఆదేశం

Jai Bhim Vanniyar Issue: Court Orders FIR Against Suriya Jyothika And Gnganavel - Sakshi

తమిళ స్టార్‌ హీరో సూర్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన 'జై భీమ్‌' చిత్రంపై చెలరేగిన వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో తమ కులాన్ని కించపరిచారని  వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 నవంబర్‌లో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

జై భీమ్‌లోని కొన్ని సన్నివేశాలు  తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, అతని భార్య జ్యోతిక(జై భీమ్‌ నిర్మాత) దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతంలో పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురును కోరింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top