నాన్నకు ప్రేమతో.. | father sentiment upcomening movie updates in Tollywood | Sakshi
Sakshi News home page

నాన్నకు ప్రేమతో..

Jun 22 2025 12:35 AM | Updated on Jun 22 2025 12:35 AM

father sentiment upcomening movie updates in Tollywood

ఫాదర్‌ ఎమోషన్‌తో సినిమాలు చేస్తున్న స్టార్‌ హీరోలు

ఓ తండ్రిది బాధ్యత... మరో నాన్నది పగ. ఇంకో ఫాదర్‌ది ప్రేమ... ఇలా ఫాదర్‌ సెంటిమెంట్, ఎమోషన్‌లతో సిల్వర్‌ స్క్రీన్‌పై సినిమాలొస్తే ఆ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. మంచి కలెక్షన్స్‌ రాబడుతున్నాయి. పైగా ఈ తరహా సినిమాల్లో తండ్రి–కొడుకు ఈ రెండు పాత్రలనూ తమ అభిమాన హీరో చేస్తే అభిమానులు ఖుష్‌ అవుతారు. ఇలా తండ్రీ కొడుకుల ద్విపాత్రాభినయంతో కొందరు హీరోలు, తండ్రిగానో, కొడుకుగానో మరికొందరు హీరోలు ‘నాన్నకు ప్రేమతో..’ అంటూ ఫాదర్‌ ఎమోషన్‌తో సినిమాలు చేసున్నారు. ఆ హీరోలపై ఓ లుక్‌ వేద్దాం...

గతం నిశ్శబ్దంగా ఉండదు 
జార్జి కుట్టి గుర్తున్నాడుగా..! అదేనండీ... తన కుమార్తెల రక్షణ కోసం, తన కుటుంబం కోసం పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తి. మలయాళ బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో మోహన్‌లాల్‌ పాత్ర పేరు జార్జి కుట్టి. ఈ సినిమాలో ఓ తండ్రిగా మోహన్‌లాల్‌ నటన అద్భుతమని ప్రేక్షకులు కితాబులు ఇచ్చారు. అందుకే ‘దృశ్యం’ సిరీస్‌ నుంచి ఇప్పటివరకు ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలు రాగా ఈ రెండు చిత్రాలూ సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు ‘దృశ్యం’ సినిమాలో మూడో భాగంగా ‘దృశ్యం 3’ రానుంది. ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్‌ ‘దృశ్యం 3’ సినిమాకూ దర్శకత్వం వహించనున్నారు.

‘గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు... దృశ్యం 3 సినిమా ఉంది’ అంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను ఖరారు చేశారు మోహన్‌లాల్‌. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభం కానుందని శనివారం మోహన్‌లాల్‌ తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా వెల్లడించారు. మరి... ఈ సారి ఓ తండ్రిగా మోహన్‌లాల్‌ తన కుటుంబాన్ని, కుమార్తెలను ఏ విధంగా సంరక్షించుకుంటారో చూడాలి. అయితే ఈసారి తండ్రీ–కుమార్తెల మధ్య ఉన్న ఎమోషనల్‌ మోతాదును పెంచాలని జీతూ జోసెఫ్‌ అనుకుంటున్నారట. ఈ  సినిమాను ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మించనున్నారు. మోహన్‌లాల్‌ త్వరితగతిన సినిమాలు పూర్తి చేస్తుంటారు కాబట్టి, ‘దృశ్యం 3’ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజైనా ఆశ్చర్యపోవడానికి లేదు.

మూడు తరాల కథ 
శర్వానంద్‌ హీరోగా ‘లూజర్‌’ ఫేమ్‌ అభిలాష్‌ కంకర దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ రానుంది. ఈ చిత్రంలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌. విక్రమ్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మూడు తరాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఫాదర్‌ అండ్‌ సన్‌ల మధ్య ఉండే ఎమోషన్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందట. మూడు తరాల నేపథ్యం కాబట్టి ఈ చిత్రం డిఫరెంట్‌ టైమ్‌లైన్స్‌లో ఉంటుందనుకోవచ్చు. ఈ సినిమాలో శర్వానంద్‌ బైక్‌ రైడర్‌గా కనిపిస్తారని, ‘రేస్‌ రాజా’ టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని సమాచారం.

హిట్‌ ఫార్ములా
ఇటీవలి కాలంలో తండ్రీ కొడుకుల వినోదం, ఎమోషన్‌ నేపథ్యం ఉన్న కొన్ని చిత్రాలు ఆడియన్స్‌ను బాగా అలరించి, హిట్‌ ఫార్ములా అనిపించాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో తండ్రి పాత్రలో వెంకటేశ్, కొడుకు రుత్విక్‌ ఉన్న సన్నివేశాలు ఆడియన్స్‌ను అలరించాయి. బాక్సాఫీస్‌ వద్ద కాస్త నిరాశపరిచిన రామ్‌చరణ్‌ ‘గేమ్‌ చేంజర్‌’ మూవీ మెయిన్‌ పాయింట్‌ ఫాదర్‌ ఎమోషనే. సముద్రఖని –ధన్‌రాజ్‌ల ‘రామం రాఘవం’, బ్రహ్మాజీ ‘బాపు’, సందీప్‌ కిషన్‌–రావు రమేశ్‌ల ‘మజాకా’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ నటుడు శశికుమార్‌ ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’, మోహన్‌లాల్‌ ‘తుడరుమ్‌’, అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ వంటి సినిమాల్లో ఫాదర్‌ ఎమోషన్‌నే మెయిన్‌ పాయింట్‌గా తెరకెక్కిన చిత్రాలూ తెలుగులో అనువాదమై, తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.

ఇటీవలి కాలంలో తండ్రీ కొడుకుల వినోదం, ఎమోషన్‌ నేపథ్యం ఉన్న కొన్ని చిత్రాలు ఆడియన్స్‌ను బాగా అలరించి, హిట్‌ ఫార్ములా అనిపించాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో తండ్రి పాత్రలో వెంకటేశ్, కొడుకు రుత్విక్‌ ఉన్న సన్నివేశాలు ఆడియన్స్‌ను అలరించాయి. బాక్సాఫీస్‌ వద్ద కాస్త నిరాశపరిచిన రామ్‌చరణ్‌ ‘గేమ్‌ చేంజర్‌’ మూవీ మెయిన్‌ పాయింట్‌ ఫాదర్‌ ఎమోషనే. సముద్రఖని –ధన్‌రాజ్‌ల ‘రామం రాఘవం’, బ్రహ్మాజీ ‘బాపు’, సందీప్‌ కిషన్‌–రావు రమేశ్‌ల ‘మజాకా’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ నటుడు శశికుమార్‌ ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’, మోహన్‌లాల్‌ ‘తుడరుమ్‌’, అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ వంటి సినిమాల్లో ఫాదర్‌ ఎమోషన్‌నే మెయిన్‌ పాయింట్‌గా తెరకెక్కిన చిత్రాలూ తెలుగులో అనువాదమై, తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.

ధారా.. ఫాదర్‌ ఆఫ్‌ దేవా 
తండ్రీకొడకుల కథలంటే ప్రభాస్‌కు బాగా ఇష్టం ఉన్నట్లుగా తెలుస్తోంది. తండ్రి ఎమోషన్‌తో ప్రభాస్‌ హీరోగా ఆల్రెడీ చేసిన ‘మిర్చి, బాహుబలి’ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. తాజాగా ప్రభాస్‌ కమిటైన చిత్రాల్లో ‘సలార్‌’ కూడా ఒకటి. ఈ సినిమాలో కూడా ఫాదర్‌ ఎమోషన్‌ గట్టిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘సలార్‌’ ఫ్రాంచైజీ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ చిత్రంలో దేవా పాత్రలో ప్రభాస్‌ కనిపించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్‌ తండ్రి పేరు ధారాగా వినిపించింది. కాగా ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ ఎండింగ్‌లో ‘సలార్‌: శౌర్యాంగపర్వం’ సినిమా ఉన్నట్లుగా మేకర్స్‌ స్పష్టం చేశారు. దీంతో ‘సలార్‌: శౌర్యాంగ  పర్వం’లో దేవా, ధారాల మధ్య మరింత ఎమోషనల్‌ కనెక్టివిటీ ఉన్న సన్నివేశాలు ఉండే అవకాశం ఉందనిపిస్తోంది. అంతేకాదు... దేవా తండ్రి ధారా పాత్రలోనూ ప్రభాసే కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది.

పైగా ‘సలార్‌’ సినిమా అనౌన్స్‌మెంట్‌ సమయంలో ప్రభాస్‌కు చెందిన రెండు డిఫరెంట్‌ లుక్స్‌ వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. వాటిలోని ఒక పోస్టర్‌లో ప్రభాస్‌ కాస్త ఏజ్డ్‌గా కనిపిస్తారు. ఈ పాత్రే ధారా అనే ఊహాగానాలు ఉన్నాయి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించనున్న ‘సలార్‌: శౌర్యాంగపర్వం’ చిత్రం ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్‌కు వెళ్లలేదు. ఇక ప్రభాస్‌ హీరోగా చేస్తున్న మరో చిత్రం ‘ది రాజాసాబ్‌’. ఈ సినిమాకు మారతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం సైతం ఓ కుటుంబానికి చెందిన మూడు తరాల నేపథ్యంలో సాగుతుందని, తాత– మనవళ్ల ఎమోషన్, ఫాదర్‌ ఎమోషన్‌ కూడా కాస్త ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఇంకా... రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’లో తండ్రీకొడుకులు అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్‌ నటించిన సంగతి తెలిసిందే. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి మధ్య ‘బాహుబలి’ సినిమాలో కాంబినేషన్‌ సీన్స్‌ లేనప్పటికీ మాహిష్మతి రాజ్యంలో తండ్రి అమరేంద్ర బాహుబలికి జరిగిన అన్యాయానికి తల్లి దేవసేన ్రపోత్సాహం, ప్రతీకారంతో.. మహేంద్ర బాహుబలి రివెంజ్‌ తీర్చుకోవడం ఆడియన్స్‌ను మెప్పించింది. ఇక ఇక్కడ ‘బాహుబలి’ ప్రస్తావన తీసుకు రావడానికి ఓ కారణం ఉంది. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ నిర్మించిన ‘బాహుబలి’ ఈ ఏడాది అక్టోబరులో రీ రిలీజ్‌ కానుంది. అయితే ‘బాహుబలి’ రెండు భాగాలను (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్‌) కలిపి ఒకే సినిమాగా ఎడిట్‌ చేసి, రీ రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

వర... సన్నాఫ్‌ దేవర 
దేవర చనిపోయినప్పుడు అతని కొడుకు వర చేతిలో కత్తి ఎందుకు ఉంది? తండ్రి దేవరను, అతని కొడుకు వరనే చం పాడా? అసలు ఏం జరిగింది? అనేది ‘దేవర 2’ సినిమాలో చూడాలి. తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్‌ ద్వి పాత్రాభినయం చేసిన చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రి పేరు దేవర. కొడుకు పేరు వర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. 2024 సెప్టెంబరు 24న ‘దేవర పార్ట్‌ 1’ విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘దేవర 2’ చిత్రం కూడా ఉంటుందని, ‘మ్యాడ్‌ 2’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

ఈ ‘దేవర 2’ చిత్రంలో తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. అసలు దేవర, అతని కొడుకు వరల మధ్య ఏం జరిగింది? దేవర నిజంగానే చనిపోయాడా? అన్న ఆసక్తికరమైన అంశాలను ‘దేవర 2’లో చూడొచ్చని ‘వార్‌ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఎన్టీఆర్‌ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇటు పోలీస్‌... అటు ఖైదీ 
తండ్రంటే ఎవరికి ప్రేమ ఉండదు. కానీ విజయ్‌ప్రకాశ్‌కు ఇష్టం లేదు. ఈ విజయ్‌ప్రకాశ్‌ ఎవరంటే... ‘సర్దార్‌’ సినిమాలో పోలీసాఫీసర్‌. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ కాంబినేషన్‌లో 2022లో వచ్చిన చిత్రం ‘సర్దార్‌’. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్వి పాత్రాభినయం చేశారు కార్తీ. తండ్రి సర్దార్‌పై దేశ ద్రోహి అనే అభియోగం ఉంటుంది. కానీ తన తండ్రి దేశద్రోహి కాదని, అసలు సిసలైన దేశభక్తుడని ప్రకాశ్‌ తెలుసుకుంటాడు. ఆ సమయంలో ఎంతో ఎమోషనల్‌ అవుతాడు. కానీ.. ‘సర్దార్‌’ సినిమాలో తండ్రీకొడుకులు మధ్య ఉన్న సన్నివేశాల నిడివి తక్కవే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్‌ 2’ రానుంది. ఈ చిత్రంలోనూ కార్తీ తండ్రీ కొడుకుగా ద్వి పాత్రాభినయం చేశారు.

పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఎస్‌. లక్ష్మణ్‌కుమార్‌ నిర్మించారు. ఇటీవలే బ్యాంకాక్‌లో జరిగిన ఓ భారీ షెడ్యూల్‌ చిత్రీకరణతో ‘సర్దార్‌ 2’ పూర్తయింది. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా కార్తీ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని కోలీవుడ్‌ సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలోని ఎమోషనల్‌ సీన్స్‌ ఆడియన్స్‌ హృదయాలను హత్తుకునేలా ఉంటాయట. ‘సర్దార్‌ 2’ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్‌ హీరోయిన్లుగా నటించారు.

మరోవైపు కార్తీ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘ఖైదీ 2’. ఈ సినిమాలో కూతురి కోసం తపన పడే దిల్లీ అనే ఖైదీ పాత్రలో కనిపిస్తారు కార్తీ. ‘ఖైదీ’లో తన కుమార్తెను కలవడంతో సినిమా ముగుస్తుంది. మరి... దిల్లీ ఎందుకు జైలుకు వెళ్లాడు? తన కుమార్తెకు దూరమై ఓ తండ్రిగా ఎంత ఆవేదన చెందాడు? అసలు దిల్లీ భార్యకు ఏం జరిగింది? అన్న విషయాలు ‘ఖైదీ 2’లో ఉండొచ్చు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఖైదీ 2’లో ఖైదీ దిల్లీ భార్య పాత్రలో అనుష్కా శెట్టి నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సెప్టెంబరులో చిత్రీకరణ ఆరంభించి, వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్‌నుప్లాన్‌ చేశారు. ‘ఖైదీ’ సినిమాను నిర్మించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థనే ‘ఖైదీ 2’నూ నిర్మించనుందట.

తొలిసారి ద్వి పాత్రాభినయం 
‘టాక్సీవాలా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబినేషన్‌లో మరో మూవీ రానున్న సంగతి తెలిసిందే. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోని ఈ 14వ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది చివర్లోప్రారంభించాలనుకుంటున్నారు. బ్రిటిష్‌ పరి పాలన కాలం నేపథ్యంలో 1854–1878ల టైమ్‌ పీరియడ్‌ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్‌ పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ తండ్రీకొడుకుగా ద్వి పాత్రాభినయం చేస్తారనే టాక్‌ వినిపిస్తోంది.

స్క్రీన్‌పై ఇప్పటివరకు విజయ్‌ దేవరకొండ ద్వి పాత్రాభినయం చేయలేదు. సో... తొలిసారి విజయ్‌ ఈ తరహా ప్రయత్నం చేస్తుండటంతో, ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్‌లో అంచనాలు ఉన్నాయి. ఇంకా ‘గీత గోవిందం, డియర్‌ కామ్రెడ్‌’ వంటి సినిమాల తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మికా మందన్నా ఈ సినిమా కోసం మరోసారి కలిసి పని చేయనున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కొన్ని వాస్తవ చారిత్రక సంఘటనల నేపథ్యంలో సాగే ఈ సినిమాను నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్‌ నిర్మించనున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రోడక్షన్‌ వర్క్‌ తుది దశకు చేరుకుంది. సెట్‌ వర్క్స్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక విజయ్‌ సెట్స్‌కి వచ్చి, రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొనడమే ఆలస్యం. 2026 చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

మధ్యతరగతి తండ్రి కథ 
పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘చౌకీదార్‌’. ఈ చిత్రంలో సాయికుమార్‌ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పృథ్వీ అంబర్, సాయికుమార్‌ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘నాన్న అంటేనే దైవం’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ పాటను బట్టి ఈ సినిమాలో తండ్రీకొడుకుల ఎమోషన్, ఓ మధ్య తరగతి తండ్రి తన కుటుంబం కోసం పోరాడే తీరు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రశేఖర్‌ బండియప్ప దర్శకత్వంలో కల్లహల్లి చంద్రశేఖర్‌ ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. 
ఇలా ఫాదర్‌ ఎమోషన్‌తో మరికొన్ని సినిమాలు రానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement