తన గాత్రంలో కోట్లాది మంది శ్రోతలను ఓలలాడించిన దిగ్గజ గాయని, 'దక్షిణ భారత నైటింగేల్' ఎస్. జానకి (88) ఇక లేరనే వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో దాదాపు 48 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు ఆమె.లాలిపాటలు, జానపదాలు, క్లాసికల్, మెలోడీలు.. ఇలా ఆమె పాడని పాట లేదు, పలకని భావం లేదు. అయితే, ఇన్ని వేల పాటలు పాడిన జానకమ్మకు తన కెరీర్లో అత్యంత సవాలుగా నిలిచిన ఒక పాట ఉందన్న విషయం మీకు తెలుసా?
గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జానకి గారు స్వయంగా తనకు అత్యంత కష్టమైన పాట గురించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 1977లో విడుదలైన కన్నడ చిత్రం 'హేమవతి'లోని 'శివ శివ ఎన్నడ నలికే ఏకే' అనే పాట తాను పాడిన అన్ని పాటలలోకెల్లా అత్యంత కష్టమైనదని ఆమె పేర్కొన్నారు. ఈ పాటను అంత క్లిష్టంగా మార్చింది ఆ పాట యొక్క స్వరకల్పనే. సంగీత దర్శకుడు ఈ పాటలోని ప్రతి రెండో చరణంలో 'తోడి', 'అపోకి' అనే రెండు వేర్వేరు రాగాలను ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా అద్భుతంగా, అంతే క్లిష్టంగా స్వరపరిచారు.
పాడేటప్పుడు రాగాలలో వచ్చే ఈ అత్యంత సూక్ష్మమైన మార్పులను పట్టుకోవడం సాధారణ విషయం కాదు. ఏ మాత్రం శృతి తప్పినా పాట గాడి తప్పుతుంది. అందుకే, క్లాసికల్ సంగీతంలో ఎంతో పట్టున్న ఎస్. జానకి సైతం, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఈ పాటను అత్యంత సవాలుతో కూడుకున్న పాటగా అభివర్ణించారు. ఆమె భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆమె పాడిన ఇలాంటి అపురూపమైన పాటలు సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.


