చాలా మిస్‌ అవుతున్నాను.. త్రిష ఎమోషనల్‌ పోస్ట్‌ | Trisha Emotional Post On S Janaki | Sakshi
Sakshi News home page

చాలా మిస్‌ అవుతున్నాను.. త్రిష ఎమోషనల్‌ పోస్ట్‌

Jul 12 2026 12:09 PM | Updated on Jul 12 2026 1:07 PM

Trisha Emotional Post On S Janaki

ప్రముఖ గాయని ఎస్‌.జానకి(88) మరణంతో తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల  నలుమూలల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్న తరుణంలో, ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక సందేశం అభిమానులను ఎంతగానో కదిలిస్తోంది. తన బ్లాక్‌బస్టర్ చిత్రం '96' షూటింగ్ సమయంలో ఎస్. జానకితో కలిసి దిగిన అరుదైన ఫోటోని త్రిష ఈ సందర్భంగా పంచుకున్నారు.

జానకమ్మను స్మరిస్తూ ఎమోషనల్ పోస్ట్
సోషల్‌ మీడియా వేదికగా జనకమ్మకు నివాళులులర్పించారు త్రిష.  ‘నా కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన చిత్రాలలో ఒకదానికి మీ పేరు (జాను) పెట్టడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. మీతో వ్యక్తిగత పరిచయం ఏర్పడటం, మీ అమూల్యమైన ప్రేమను పొందడం నా జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. మీ ఆప్యాయత, దయ, మరువలేని చిరునవ్వుకు ధన్యవాదాలు. ఎంతటి గొప్ప కళాకారులైనా ఎంత వినయంగా ఉండాలో మీరే నిరూపించారు. మీ గాత్రం అమరమైనది, అది ఎప్పటికీ మన మధ్యే ఉంటుంది. జానకి అమ్మా.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’ అని ఇన్‌స్టాలో రాసుకొస్తూ..ఆమెతో కలిసి దిగిన ఫోటోలని షేర్‌ చేసింది.

'96' సినిమాలో జానకమ్మ
చాలా మంది అభిమానులకు తెలియని విషయం ఏమిటంటే, విజయ్ సేతుపతి, త్రిష నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ '96' చిత్రంలో ఎస్. జానకి ఒక ప్రత్యేకమైన సీన్‌లో నటించారు. సినిమా షూటింగ్ సమయంలో ఆమెపై ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరించినప్పటికీ, చిత్ర నిడివి ఎక్కువైపోవడంతో ఆ సీన్‌ను ఎడిటింగ్‌లో తొలగించాల్సి వచ్చింది. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ డిలీటెడ్ సీన్ ఇంటర్నెట్‌లో విడుదలై, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement