ప్రముఖ పంజాబీ గాయని, 'యార్ నా మిలే' ఫేమ్ జాస్మిన్ సాండ్లాస్ తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన తన ' ది డ్రీమ్ గర్ల్ ఇండియా' లైవ్ కచేరీ స్టేజీపైనే ఆమె తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. తన కాబోయే భర్త శేఖర్ చౌదరిని అభిమానులకు పరిచయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
స్టేజీపైనే నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ..
తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచే జాస్మిన్, ఈ కచేరీలో మాత్రం ఎంతో ఉత్సాహంగా కనిపించారు. యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ఈవెంట్లో అభిమానుల కోలాహలం మధ్య ఆమె తన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపించారు. అనంతరం శేఖర్ చౌదరిని స్టేజీపైకి ఆహ్వానిస్తూ..‘ఇతనే నా వ్యక్తి, నా వేలికి ఉంగరం తొడిగిన నా చౌదరి సాబ్’ అంటూ ఎంతో సంతోషంగా పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఈ జంట జాస్మిన్ పాడిన ప్రసిద్ధ పంజాబీ గీతం 'లావన్' బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుండగా స్టేజీపై రొమాంటిక్గా నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు ఈ కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అలరించిన 'ది డ్రీమ్ గర్ల్ ఇండియా'
పంజాబ్ సింగర్ జాస్మిన్ శాండ్లాస్ గాత్రానికి లక్షలాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పాటలకు మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. ‘ధురంధర్’ సినిమాలో ఆమె ఆలపించిన ‘తెను షరాత్సికా’ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో హచ్చల్ చేస్తోంది. ఈ పాటకు లక్షలాది మంది రీల్స్ చేస్తున్నారు. యూట్యూబ్లో మిలియన్కి పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది. తాజాగా ఆమె ఢిల్లీలో 'ది డ్రీమ్ గర్ల్ ఇండియా' పేరుతో కచేరీ నిర్వహించింది. ఈ ఈవెంట్లో ఆమె గోల్డెన్ లెహంగా ధరించి ఎంతో అందంగా మెరిశారు. తన కెరీర్ లోని సూపర్ హిట్ పాటలైన 'ధురంధర్', 'శరారత్', 'జాయే సజనా', 'యార్ నా మిలే', 'తరస', 'ఇలీగల్ వెపన్' వంటి పవర్ ఫుల్ పాటలతో స్టేజ్పై ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఢిల్లీ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఢిల్లీ తర్వాత ఈ టూర్ ముంబై, బెంగళూరు, చండీగఢ్లలో కూడా కొనసాగనుంది.


