
ప్రముఖ టీవి నటి దీపికా కాకర్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగ పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గత కొన్ని వారాలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న దీపికా, ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా, ఆమె కాలేయంలో టెన్నిస్ బాల్ పరిమాణంలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తదుపరి పరీక్షల్లో ఇది స్టేజ్-2 మాలిగ్నెంట్ (క్యాన్సరస్) కణితిగా నిర్ధారణ అయింది.
దీపికా తన పోస్ట్లో, "గత కొన్ని వారాలు మాకు చాలా కష్టంగా గడిచాయి. కడుపు పైభాగంలో నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా, కాలేయంలో కణితి ఉన్నట్లు తెలిసింది. ఇది స్టేజ్-2 క్యాన్సర్గా నిర్ధారణ అయింది. ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటాను. దేవుని అనుగ్రహంతో పాటు, నా అభిమానుల ఆశీర్వాదాలు, ప్రేమతో ఈ కష్టాన్ని అధిగమిస్తానని నమ్ముతున్నాను’ అని దీపికా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీపికా త్వరగా కోలుకోవాలని నెటిజన్స్, సహ నటులు కామెంట్లు చేస్తూ, ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
కాగా, ఇటీవల జమ్ము కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నుంచి దీపికా కాకర్ కుటుంబం తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ‘ససురల్ సిమర్ కా’ సీరియల్తో బాగా పాపులర్ అయిన దీపికా, తన భర్త షోయబ్ ఇబ్రహీం, కుమారుడు రుహాన్తో కలిసి కశ్మీర్లో విహారయాత్రకు వెళ్లారు. వారు పహల్గాం సహా పలు ప్రాంతాలను సందర్శించారు. వారు తమ వెకేషన్ను ముగించుకుని తిరిగి వచ్చిన కొన్ని గంటల్లోనే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ విషయాన్ని దీపికా-షోయబ్ జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, తాము క్షేమంగా ఉన్నామని అభిమానులకు తెలియజేశారు.
దీపిక కాకర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు.ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. టీవీ నటిగా వచ్చిన పాపులారిటీతోనే 2018లో హిందీ బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో విన్నర్గా నిలిచింది. అదే ఏడాదిలో షోయబ్ ఇబ్రహీంతో వివాహం జరిగింది. వీరికి 2023లో రుహాన్ అనే కుమారుడు జన్మించాడు. దీపికా తాజాగా ‘సెలబ్రిటీ మాస్టర్షెఫ్ ఇండియా’ షోలో కనిపించారు.