
‘‘చిత్ర పరిశ్రమకి వీడియో పైరసీ అన్నది చాలా నష్టం కలిగిస్తోంది. ఈ పైరసీ నియంత్రణకి కఠిన చర్యలు చేపడుతున్నాం... ఇందుకోసం త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నాం’’ అని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ‘దిల్’ రాజు తెలిపారు. ఎఫ్డీసీ ఎండీ సీహెచ్ ప్రియాంకతో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పలు కీలక సమావేశాలు నిర్వహించాం. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.
ఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సినిమా షూటింగ్లకు ఆన్లైన్ అనుమతులపైనా చర్చించనున్నాం. సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందరం కలిసి సినీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీ సమస్యలను ఎవరైనా మా దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తాం’’ అని ఎఫ్డీసీ ఎండీ సీహెచ్ ప్రియాంక హామీ ఇచ్చారు.