నెల రోజులు దాటినా కూడా దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా రిలీజైన 34 రోజుల్లోనే అరుదైన రికార్డ్ సాధించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మూవీ పఠాన్ రికార్డ్ను అధిగమించింది. తాజా వసూళ్లతో యూకేలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా దురంధర్-2 నిలిచింది.
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ మూవీ యూకేలో 34 రోజుల్లోనే రూ. 55.55 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే గతంలో ఉన్న పఠాన్ మూవీ రికార్డ్ను(రూ.55.40 కోట్లు) దాటేసింది. ఆ తర్వాత వరుసగా జవాన్, సైయారా, రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ, దిల్వాలే, పద్మావత్, చెన్నై ఎక్స్ప్రెస్ ఈ జాబితాలో ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే దురంధర్-2 అంతర్జాతీయంగా రూ. 422 కోట్లకు పైగా వసూలు చేసింది. చైనా మినహా పలు దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,761.88 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కంటే బాహుబలి-2, దంగల్ చిత్రాలు మాత్రమే ముందున్నాయి.
కాగా.. ఈ ఏడాది మార్చి 19న విడుదలైన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, డానిష్ పండోర్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్లో రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచిన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు.


