అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ | Sakshi
Sakshi News home page

అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ

Published Thu, Oct 15 2020 1:11 AM

Colour Photo Movie To Premiere On Aha Video - Sakshi

‘‘నా సొంత అనుభవాల నుంచి నేను తయారు చేసుకున్న కథే ‘కలర్‌ ఫొటో’. 1990 – 97 ప్రాంతంలో జరిగిన ఈ కథ అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఇంటర్నెట్‌ లేని టైమ్‌లో ప్రేమలు ఎలా ఉన్నాయి? అనే అంశాన్ని ఈ సినిమాలో చెప్పాం’’ అని నిర్మాత సాయి రాజేష్‌ నీలం అన్నారు. హాస్యనటుడు సుహాస్‌ హీరోగా, చాందీని చౌదరి హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘కలర్‌ ఫొటో’. సునీల్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. సందీప్‌ దర్శకత్వం వహించారు.

లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో సాయి రాజేష్‌ నీలం, బెన్నీ ముప్పానేని, అమృత ప్రొడక్షన్‌ బ్యానర్‌పై శ్రవణ్‌ కొంక నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న ‘ఆహా’ ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిరాజేష్‌ నీలం మాట్లాడుతూ– ‘‘గతంలో నిర్మించిన ‘హృదయ కాలేయం, కొబ్బరిమట్ట’ రెండూ కమర్షియల్‌ హిట్స్‌ అయినప్పటికీ, మా బ్యానర్‌కి రావాల్సిన గౌరవం రాలేదనుకుని, ‘కలర్‌ ఫొటో’ నిర్మించాను.

ఈ చిత్రం టీజర్‌తోనే నాకు, నా బ్యానర్‌కి మంచి గుర్తింపు, గౌరవం వచ్చాయి. రంగు వివక్ష గురించి ఈ సినిమాలో నిజాయతీగా చెప్పడానికి ప్రయత్నించాం. అలా అని ఇదేదో సీరియస్‌ సబ్జెక్ట్‌ కాదు.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం, భావోద్వేగాలుంటాయి. ఈ కథకి తగిన హీరోగా సుహాస్‌ సూట్‌ అవుతాడని తీసుకున్నాం. సునీల్‌గారు ఈ సినిమాలో హీరోయిన్‌ అన్న పాత్రలో ఒక పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. కాలభైరవ సంగీతం ఓ ప్లస్‌ పాయింట్‌’’ అన్నారు.

Advertisement
Advertisement