బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది చిత్రం థియేటర్స్లో సందడి చేస్తోంది. నిన్న(జూన్ 3) రాత్రి ప్రీమియర్ షో నుంచే మెగా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్స్కి పోటెత్తారు. ఒక సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం సినిమా చూసి..సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొడుకు సినిమాపై స్పందించాడు. ఎక్స్ వేదిగా ‘పెద్ది’పై తనదైన శైలీలో రివ్యూ ఇస్తూ.. ‘తండ్రిగా, నటుడిగా చరణ్ చూసి గర్వంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)
‘నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకి నా ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత సతీష్ కిలారుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, ‘కరునాడ చక్రవర్తి’ శివరాజ్ కుమార్, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతి బాబుకి అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన రెహమాన్కి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్ను అత్యద్భుతంగా మలిచిన, అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన కొల్లా అవినాష్, తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ నవీన్ నూలికి ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన జాన్వీ కపూర్, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. పెద్ది సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.


