సాధారణంగా సినిమాలు తొలుత థియేటర్స్లో రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత ఓటీటీలోకి వస్తాయి. పెద్ద సినిమాలు అయితే నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తే..చిన్న సినిమాలు రెండు, మూడు వారాల్లో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ ఓ తెలుగు సినిమా మాత్రం థియేటర్స్లో ఉండగానే ఫ్రీగా యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అదే ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ హారర్ కామెడీ చిత్రం జూన్ 26న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఒకవైపు థియేటర్స్లో ఆడుతుండగానే యూట్యూబ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ టైమ్స్ యూట్యూబ్ చానల్లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న సపోర్ట్, లవ్ మాటల్లో చెప్పలేనిది. మా కోసం ఇంతగా నిలబడిన ప్రేక్షకుల కోసం సినిమాను ఉచితంగా ఇవ్వలేనా ఏంటి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిన వారు లేదా మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు యూట్యూబ్లో ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయవచ్చు’ అని తెలిపారు.


