
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. మోస్ట్ వయొలెంట్ మూవీగా విమర్శలు వచ్చినప్పటికీ కమర్షియల్గా సక్సెస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పట్లో ఈ మూవీపై కొందరు సినీ ప్రముఖులు సైతం విమర్శలు చేశారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ కావడంపై నిర్మాత భూషణ్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. యానిమల్ మూవీ ఓపెనింగ్ రోజు ఆ స్థాయిలో కలెక్షన్స్ రావడానికి కారణం సందీప్ రెడ్డి వంగానే అన్నారు. ఈ మూవీ విజయానికి క్రెడిట్ అంతా సందీప్కే దక్కుతుందని తెలిపారు.
భూషణ్ కుమార్ మాట్లాడుతూ..' యానిమల్ సినిమాపై సందీప్ నమ్మకం వేరే స్థాయిలో ఉండేది. అందుకే అతనికే ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. ఇది ఒక డిఫరెంట్ సినిమా. రణ్బీర్ కపూర్ ఈ చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తి చూపించాడు. ఎందుకంటే అంతకుముందు ఇలాంటి పాత్రను చేయలేదు. ఈ సినిమా ఎంత బాగా వర్కవుట్ అవుతుందో అప్పుడు మాకెవరికీ తెలియదు. ఈ మూవీపై భారీగానే విమర్శలు వచ్చినప్పటికీ వసూళ్లను సాధించింది. ఏ సర్వేలో చూసినా మోస్ట్ అవైటేడ్ చిత్రం యానిమల్ అనే వచ్చింది. ఈ సినిమా దర్శకుడిపై పూర్తి నమ్మకముంది. అందుకే సందీప్కే క్రెడిట్ ఇస్తాను. మొదటి కాపీ చూసినప్పుడు నిడివి చాలా ఎక్కువగా ఉందని అతనితో చెప్పా. కానీ సందీప్ నాతో.. సర్, నన్ను ఏమీ కట్ చేయమని అడగకండి. ఈ మూవీ అద్భుతమైన బిజినెస్ చేస్తుందని నాకు నమ్మకం ఉంది. మొదటి రోజే రూ.50 కోట్లకు పైగా సాధిస్తుందని సందీప్ నాతో అన్నారని' వివరించారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో యానిమల్ పార్క్ పేరుతో సీక్వెల్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రివీల్ చేయలేదు.