
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నేడు 42వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రిష తెలుగు, తమిళ్తో పాటు బాలీవుడ్లోనూ నటించింది. ఇటీవల కెరీర్లో లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫాంలో ఉంది. అయితే, ప్రతి ఒక్కరికి జీవితాన్ని మార్చేసిన సినిమా అంటూ ఒకటి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ, బాలకృష్ణకు మంగమ్మగారి మనవడు ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సినిమా తమ జీవితాన్ని మార్చేసి ఉంటుంది. అలా త్రిష జీవితాన్ని టర్న్ చేసిన రెండు చిత్రాలు ఉన్నాయి.

వర్షంతో మార్పు
2004లో ప్రభాస్తో 'వర్షం' సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమా త్రిష కెరీర్నే మార్చేసింది. శైలజ అలియాస్ శైలు పాత్రలో కనిపించిన త్రిష ప్రేక్షకులను మాయ చేశారు. అలా తన అందంతో అందరినీ వర్షంలో తడిసేలా చేశారు. ఈ క్రమంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా,అతడు,ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ,బుజ్జిగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్లో త్రిష చేరిపోయారు.

'గిల్లీ'తో భారీగా ఆఫర్లు
తెలుగులో మహేశ్ బాబు- భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఒక్కడు’కు రీమేక్గా ‘గిల్లీ’ చిత్రం తమిళ్లో 2004లో విడుదలైంది. ఇందులో విజయ్- త్రిష జంటగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 రోజులకు పైగా కొనసాగింది. విజయ్ కెరీర్లో ఇది అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిస్తే త్రిషకు తమిళ్లో భారీ ఆఫర్స్ను తెచ్చిపెట్టింది. ఏకంగా ఆమెకు 12 సినిమా ఛాన్సులు దక్కాయి. ఆపై వాణిజ్యం ప్రకారం, ఈ చిత్రం 2004లో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రంగా రజనీకాంత్ నటించిన నరసింహా ఉండేది. దానిని గిల్లీ దాటేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా రాబట్టడమే కాకుండా అనేక రికార్డ్స్ను అందుకుంది.
బాలీవుడ్కు దూరంగా ఎందుకు ఉన్నానంటే: త్రిష
బాలీవుడ్లో 'కట్టా మిఠా' అనే చిత్రంలో త్రిష నటించారు. అయితే, అదే ఆమె నటించిన తొలి, చివరి చిత్రంగా మారింది. ఒక భేటీలో తొలి హిందీ చిత్రం ప్లాప్ కావడంతో బాలీవుడ్లో అవకాశాలు రాలేదా..? అన్న ప్రశ్నకు త్రిష బదులిస్తూ.. తాను 2010లో కట్టా మిఠా చిత్రంతో బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యానన్నారు. అక్షయ్కుమార్ హీరోగా నటించిన ఆ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడని చెప్పారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందన్నారు.
దీంతో బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం ప్లాప్ కావడంతో అవకాశాలు రాలేదని, తాను బాలీవుడ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి తాను తన కుటుంబాన్ని ముంబాయికి మార్చడానికి సిద్ధంగా లేనన్నారు. బాలీవుడ్కు వెళ్లాలంటే దక్షిణాదిలో చాలా మందిని వదులుకోవాలన్నారు. అలాగే బాలీవుడ్లో తన కెరీర్ను మళ్లీ కొత్తగా మొదలెట్టాల్సి ఉంటుందన్నారు. అంత ఆసక్తి తనకు అప్పట్లో లేదన్నారు. అందుకే హిందీ చిత్రాల్లో కంటిన్యూగా నటించలేదని త్రిష స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ కమలహాసన్కు జంటగా థగ్ లైఫ్ చిత్రాలతో పాటు తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు.