నేచురల్ యాక్టింగ్తో పక్కింటి కుర్రాడు అనిపించుకున్నాడు హీరో తరుణ్. వరుసగా హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు అందుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఇతడికి తిరుగులేదు.. నెక్స్ట్ స్టార్ హీరో ఇతడే అనుకున్న తరుణంలో సడన్గా కనిపించకుండా పోయాడు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా.. అవేంటో అభిమానులకు కూడా సరిగ్గా తెలీని పరిస్థితి! ఈరోజు (జనవరి 8న) తరుణ్ బర్త్డే.. ఈ సందర్భంగా తరుణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
తల్లిదండ్రుల అడుగుజాడల్లో..
సీనియర్ నటి రోజా రమణి, నటుడు సుశాంత్ చక్రపాణిల కుమారుడే తరుణ్. చిన్న వయసులోనే తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిచాడు. నాయకుడు, అగ్ని నక్షత్రం, అంజలి, మనసు మమత, ఆదిత్య 369, పిల్లలు దిద్దిన కాపురం, తేజ వంటి సినిమాల్లో బాలనటుడిగా యాక్ట్ చేశాడు. అంజలి మూవీకిగానూ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్గా జాతీయ అవార్డు అందుకున్నాడు.
ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్
'నువ్వే కావాలి' మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఫస్ట్ సినిమాకే ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ మూవీ వందరోజులకు పైగా ఆడటంతో పాటు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కొల్లగొట్టింది. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, నవ వసంతం.. ఇలా ఎన్నో హిట్స్ అందుకోవడంతో పాటు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
కోలీవుడ్కి గుడ్బై
దీంతో తమిళంలో అవకాశాలు రాగా అక్కడ కూడా రెండు సినిమాలు చేశాడు. కానీ అవి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడేసరికి కోలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. తరుణ్ను తెలుగులోనూ వరుస ఫ్లాపులు వెంటాడాయి. కథల ఎంపికలో పొరపాట్లు చేయడంతో మళ్లీ పరాజయాలే చూశాడు. 2018లో వచ్చిన ఇది నా లవ్ స్టోరీ మూవీలో చివరిసారిగా కనిపించాడు. ఇది డిజాస్టర్ అయ్యేసరికి సినిమాలే వదిలేశాడు.
రీ ఎంట్రీ ఆలస్యం!
అయితే 2023లో రోజా రమణి.. తరుణ్ రీఎంట్రీ ఉంటుందని ప్రకటించింది. ఒక సినిమాతోపాటు ఒక వెబ్సిరీస్కు కూడా సంతకం చేశాడంది. కానీ, ఇంతవరకు వాటి గురించి ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు. లేటుగా వచ్చినా పర్లేదు కానీ మంచి కంటెంట్తో రీఎంట్రీ ఇస్తే అంతే చాలని కోరుకుంటున్నారు తరుణ్ అభిమానులు. తరుణ్ను మళ్లీ వెండితెరపై చూసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు.


