మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీతో పాటు ప్రైవేట్ ఐటీఐలో శనివారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు వాక్ ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసుకొని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హాజరు కావాలన్నారు. నిర్ధేశించిన ట్రేడ్లలో మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు కాపీని తీసుకురావాలి. ఖాళీ సీట్ల వివరాలు ప్రతిరోజు ఉదయం అప్డెట్ చేస్తామన్నారు.
సంగారెడ్డి క్రైమ్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు అండర్–16 సెలక్షన్ ఈనెల 30న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజేందర్ తెలిపారు. సంగారెడ్డి జూబ్లీ క్లబ్ ప్రాంగణంలోని ఎమ్మెస్ క్రికెట్ మైదానంలో ఎంపిక నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఒరిజినల్ జనన ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్, బోనఫైడ్, 2 ఫొ టోలతో హాజరుకావాలని సూచించారు.
రామాయంపేట(మెదక్): సీఎంఆర్ బకాయిపడిన మండలంలోని అక్కన్నపేట శివారులో ఉన్న భద్రకాళి రైస్మిల్లులో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రైస్మిల్లులో స్టాక్తో పా టు రికార్డులు పరిశీలించారు. వివరాలు చెప్పడానికి వారు నిరాకరించారు. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానందగౌడ్ను సంప్రదించగా.. భద్రకాళి రైసుమిల్లు యాజమాన్యం మూడు సీజన్లకు సంబంధించి సీఎంఆర్ రైస్ ఇవ్వాల్సి ఉందన్నారు. దీంతో రాష్ట్ర విజిలెన్స్ బృందం తనిఖీలు నిర్వహించిందని చెప్పారు.
రేగోడ్(మెదక్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అధికారులకు సూచించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు, రికార్డులను పరిశీలించారు. అనంతరం గజ్వాడలో పంచాయతీ భవనం, బీసీ, ఎస్సీ కమ్యూనిటీ భవనాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి పథకాల ప్రయోజనాలను సకాలంలో అందించాలని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్ సరోజన పాల్గొన్నారు.
అకాడమిక్ క్యాలెండర్లో
విద్యార్థుల ఫొటో
నంగునూరు(సిద్దిపేట): నర్మేట పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రచురిస్తున్న అకాడమిక్ ఇయర్ క్యాలెండర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కలసి విద్యార్థులు దిగిన ఫొటోను ప్రచురించారు. మార్చి 22న నర్మేటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం, రాష్ట మంత్రులు వివేక్, తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్ తోపాటు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ స్టాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి, అల్పాహారంపై తీసుకున్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్టాల్ను పరిశీలించిన సీఎం, మంత్రులు, విద్యాశాఖ కమిషనర్, ఎంపీ రఘునందన్రావులు విద్యార్థులతో మాట్లాడి సంతోషంతో ఫొటో దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముద్రించిన క్యాలెండర్లో మార్చి 2027 నెల పేజీలో నాటి ఫొటోతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఫొటోకు చోటు దక్కింది.


