● జిల్లాలో సుదీర్ఘ కాలం మైనింగ్ ఏడీఏగా పనిచేసిన జయరాజ్
● పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు
తూప్రాన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ ఇళ్లు, ఆయన బంధువుల నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన దాడుల్లో కళ్లు బైర్లు కమ్మే ఆస్తు లు వెలుగుచూశాయి. సుమారు రూ.100 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే జయరాజ్ గతంలో జిల్లా మైనింగ్ ఏడీఏగా సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన తన అధికార బలంతో భారీగా అక్రమ సంపాదనకు తెరలేపినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా లోని తూప్రాన్, శివ్వంపేట, మాసాయిపేట, చేగుంట తదితర మండలాల్లో మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కంకర మిషన్లు (స్టోన్ క్రషర్లు), క్వారీల యజమానులతో చేతులు కలిపి జయరాజ్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్దంగా కంకర మిషన్లకు అనుమతులు ఇవ్వడం, పరిమితికి మించి మైనింగ్ జరుగుతున్నా మామూళ్లు తీసుకొని పట్టించుకోకపోవడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ. కోట్ల ఆదాయానికి గండికొట్టి, ప్రైవేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరుస్తూ తన సొంత ప్రయోజనాలు చూసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూప్రాన్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేకాధికారిగా పనిచేసిన సమయంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు పలువురు విమర్శిస్తున్నారు.
అక్కడా అదే దందా..
ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనింగ్ శాఖ ఏడీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జయరాజ్ తన ‘మామూళ్ల’ దందాను యథేచ్ఛగా కొనసాగించినట్లు సమాచారం. ఇంత స్వల్ప కాలంలోనే రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టడం వెనుక మైనింగ్ మాఫియాతో ఆయనకున్న సంబంధాలే కారణమని తెలుస్తోంది. ఈ అవినీతి సామ్రాజ్యం వెనుక పెద్దల హస్తం ఉందనే కోణంలోనూ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.


