కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: చేయూత పింఛన్ల దరఖాస్తుల్లో సమస్యల పరిష్కారానికి హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఈనెల 26వ తేదీన దివ్యాంగుల కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక యూడీఐడీ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేయూత పింఛన్ల దరఖాస్తులను లబ్ధిదారులు మండలం, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. ఈనెలాఖరుతో గడువు ముగియనున్నట్లు చెప్పారు. ఏమైనా సమస్యలుంటే కలెక్టరేట్లో గల హెల్ప్డెస్క్ 8008556112 నంబర్లో సంప్రదించాలన్నారు. అలాగే ఈనెల 23 నుంచి చేగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభం అవుతాయని, వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని సహకరించాలని కలెక్టర్ సూచించారు.
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో నిషేధిత 22–ఏ జాబితాలో చేర్చిన భూముల వివరాలను బహిర్గతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్లో డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్కు వినతిపతరం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల విస్తీర్ణం ఎంతో చెప్పాలన్నారు. నిషేధిత జాబితాలో భారీగా భూములు చేరడం వెనక కుట్ర దాగి ఉందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని బచ్చురాజ్పల్లి, నస్కల్, నిజాంపేట గ్రామాల పరిధిలోని 33/11 కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు ఏఈ గణేశ్ తె లిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 3 గ్రామాల సబ్స్టేషన్ పరిధిలో గల వ్యవసాయ భూములకు 3 ఫేజ్ విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్లు చెప్పారు. ఇందుకు రైతులు సహకరించాలని కోరారు.
రామాయంపేటలో..
రామాయంపేట(మెదక్): మెదక్ 132 కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా శనివారం పట్టణంలో కరెంటు సరఫరా ఉండదని ట్రాన్స్కో ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఈవిషయాన్ని వినియోగదారులు గమనించాలని సూచించారు.
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పెద్దచింతకుంట)లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ హుస్సేన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామర్స్ సబ్జెక్టు బోధించేందుకు ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. జనరల్ అభ్యర్థులకు పీజీలో 55% మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు తప్పనిసరి. పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత కలిగి, బోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రా ధాన్యం ఉంటుందన్నారు. ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 25న మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డెమో ఉంటుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ త్వరతగతిన కుట్టించాల్సిన బాధ్యత మండల ఏపీఎంలపై ఉందని ఐకేపీ డీపీఎం రమేశ్బాబు అన్నారు. శుక్రవారం హత్నూర ఐకేపీ కార్యాలయంలో యూనిఫారాలను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 23 గ్రామీణ మండలాల్లోని 945 పాఠశాలల్లో 1 నుంచి పదో తరగతితో పాటు కేజీబీవీలో ఇంటర్ చదువుతున్న మొత్తం 61,777 విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 12,461 యూనిఫామ్స్ కుట్టడం పూర్తయిందన్నారు. 7,563 యూనిఫారాలను ఇప్పటికే విద్యార్థులకు అందించామన్నారు. ప్రస్తుతం మరో రెండు వేలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు.


