చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శనివారం ఎట్టకేలకు యూరియా నిల్వలు చేరుకున్నాయి. రెండు రోజుల క్రితమే యూరియా కొనుగోలు కోసం డీడీ చెల్లించగా, శనివారం లోడ్ పీఏసీఎస్కు వచ్చింది. గురువారం పీఏసీఎస్లో ఫర్టిలైజర్కు సంబంధించిన నిధుల గోల్మాల్పై ‘సాక్షి’ దినపత్రికలో ‘‘స్వాహాకారం’’ పేరుతో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. అధికారుల తనిఖీలు, ఒత్తిడితో పీఏసీఎస్ సిబ్బంది కాజేసిన సొమ్ములో కొంత మేర డబ్బును తిరిగి బ్యాంకులో జమ చేశారు. అయితే సోమవారంలోగా పూర్తి డబ్బును బ్యాంకు అకౌంట్లో జమ చేయాలని డీసీసీబీ మేనేజర్ చంద్రశేఖర్, ఫీల్డ్ ఆఫీసర్ సంగమేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మొత్తం 1,120 బస్తాల యూరియాకు డీడీ చెల్లించగా, ప్రస్తుతానికి 450 బస్తాల లోడ్ వచ్చిందని పీఏసీఎస్ సీఈఓ రమేష్ తెలిపారు. ఈ యూరియాను ఆన్లైన్ యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకున్న రైతులకు నిబంధనల ప్రకారం పంపిణీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.


