హరాహోరీ ప్రచార భేరి హరాహోరీ ప్రచార భేరి
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల పాట్లు
●మిగిలింది నాలుగు రోజులే.. ●అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న బల్దియా పోరు
మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రచారానికి ఇంకా నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండటంతో ర్యాలీలు, కార్నర్ మీటింగ్లతో హోరెత్తిస్తున్నారు. వారి తరఫున ముఖ్య నేతలు రంగంలోకి దిగడంతో ‘పుర’ పోరు రసవత్తరంగా మారింది. – మెదక్జోన్
జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. ఇందులో మెదక్ పట్టణంలో ఒక వార్డు ఏకగ్రీవం అయింది. ఇక మిగిలిన 74 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన పార్టీల ముఖ్య నాయకులకు పరీక్షగా మారింది. అధిక వార్డులు కై వసం చేసుకొని చైర్మన్ పదవులను దక్కించుకోవాలనే లక్ష్యంతో రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో బల్దియా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి.
ప్రచారంలో అగ్రనేతలు
ప్రధాన పార్టీల అభ్యర్థులను గెలిపించేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్యే రోహిత్, మైనంపల్లి హన్మంతరావు మెదక్, రామాయంపేట బల్దియాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం ఆ పార్టీ అగ్రనేత హరీశ్రావు సైతం జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. త్వరలో మెదక్ బల్దియాలో నిర్వహించే రోడ్షోలో మరోమారు పాల్గొననున్నట్లు తెలిసింది. అలాగే బీజేపీ ఎంపీ రఘునందన్రావు సైతం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఇప్పటికే ప్రచారం నిర్వహించటంతో పాటు ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మాజీ ఎమ్మె ల్యే పద్మారెడ్డి సైతం వార్డుల్లో విస్తృతంగా ప్రచా రం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ జిల్లాస్థాయి నేతలు సైతం ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
మహిళా
ఓటర్లు
కీలకంజిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 85,185 మంది ఓటర్లు ఉండగా, వాటిలో మహిళా ఓటర్లు 45,168 మంది ఉన్నారు. పురుషుల ఓటర్లు 43, 592 ఉన్నారు. ఈ లెక్కన పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 1,576 మంది అధికంగా ఉన్నారు. దీంతో అన్నిపార్టీల నేతలు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులను మచ్చిక చేసుకుంటూ గంపగుత్త ఓట్ల కోసం పావులు కదుపుతున్నారు.


