
నామినేటెడ్కు వేళాయే!
జిల్లాలో ఆరు మార్కెట్ కమిటీలు ఆశావహుల పేర్లు ఖరారు.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రకటన
జిల్లాలో మెదక్, రామాయంపేట, పాపన్నపేట, నర్సాపూర్, చేగుంటతో పాటు నూతనంగా ఏర్పాటైన తూప్రాన్తో కలిపి మొత్తం ఆరు మార్కె ట్ కమిటీలు ఉన్నాయి. అలాగే ఏడుపాయల దేవస్థానం పాలకమండలి ఉంది. మార్కెట్ కమిటీల పదవీకాలం ముగిసి రెండేళ్లు పూర్తికాగా, ఏడుపాయల పాలకమండలి పదవి ముగిసి ఏడాది గడిచింది. కాగా మార్కెట్ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు 10 మంది డైరెక్టర్లు, ఇద్దరు లైసెన్స్ ట్రేడర్స్ సభ్యులు, జిల్లా మార్కెటింగ్ అధికారి, సొసైటీ చైర్మన్, అగ్రికల్చర్ అధికారి, మున్సిపల్ ప రిధి అయితే మున్సిపల్ చైర్మన్, గ్రామీణ ప్రాంతం అయితే సర్పంచ్ సభ్యులుగా ఉంటారు. మొత్తం 18 మంది పాలకమండలిలో ఉంటారు.
ఈఓ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు..
రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందిన ఏడుపాయల దేవస్థానానికి ఏడాదిగా పాలకమండలి లేకుండానే ఈఓ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయంలో మొత్తం ధర్మకర్తలు 14 మంది ఉంటారు. ఇందులో ఒక చైర్మన్తో పాటు 13 మంది సభ్యులు కొనసాగుతారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు ఉన్నతవర్గాలకు చెందిన వారు సైతం సభ్యులుగా ఉంటారు. కాగా చైర్మన్ పదవిని పాపన్నపేట మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు గోవింద్నాయక్, శ్రీకాంతప్ప, సతీశ్, శ్రీకాంత్రెడ్డి, మల్లప్ప ఆశిస్తున్నారు.
పదిహేను రోజుల్లో పదవుల భర్తీ!
జిల్లాలోని పలు నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు పూర్తయినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పదవుల భర్తీ చేసేందుకు అధికార పార్టీ నేతలు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతల పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. మరో 15 రోజుల్లో పదవుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని జిల్లాకు ఓ సీనియర్ నేత పేర్కొన్నారు. – మెదక్జోన్