లక్సెట్టిపేట: మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేసినట్లు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. లక్సెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి జాతకాలు చూసి ఆరోగ్యం బాగు చేస్తాడని నమ్మిన ధర్మపురికి చెందిన మహిళ తన కూతురు మైనర్ బాలికను ఈనెల 8న అతని వద్దకు తీసుకొచ్చింది. ఈక్రమంలో అతను బాలికను పూజల నిమిత్తం పూజ గది బయట వైపు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధించాడు. ఈవిషయం తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక మరుసటి రోజు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే బాలిక తల్లి లక్సెట్టిపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు గురువారం సతీశ్పై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కాగా ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దన్నారు. ఎస్సై సురేశ్, ఏఎస్సై అన్వర్, సిబ్బంది వసంత్, అన్వర్, సుధాకర్, రాజమౌళి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


