తాండూర్: రోగులకు అందించే వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శించవద్దని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్కు పంపించే నమూనాల వివరాలను రోజువారీగా నమోదు చేయాలని, జ్వరబాధితుల రక్తనమూనాలను సేకరించడం, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్ ద్వారా తక్షణమే పరీక్ష చేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలని, గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. పీహెచ్సీ సీహెచ్ఓ జయమణి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు.


