మంచిర్యాలరూరల్(హాజీపూర్): తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన వారు తమ ఎదుగుదల, ఉన్నతిని బహుమానంగా ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని గోసేవా మండల్లో నివాసముంటున్న గుజ్జేటి నగేశ్ బస్టాండ్ సమీపంలో మిర్చీ, జ్యూస్ బండి నడుపుతూ జీవనం సాగిస్తుండగా భార్య సుజాత టైలరింగ్ పని చేస్తూ భర్తకు తోడుగా నిలుస్తోంది. వీరికి అభిలాశ్, శ్రీనిధి సంతానం. వీరిద్దరూ మంచిర్యాలలో పదోతరగతి వరకు చదవగా ఇంటర్ హైదరాబాద్లో పూర్తి చేశారు. ఇద్దరూ బైపీసీ పూర్తి చేసి నీట్ పరీక్షలో అర్హత సాధించి వైద్య విద్యార్థులయ్యారు. కాగా, అభిలాశ్ వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రస్తుతం ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం పూర్తి చేశాడు. శ్రీనిధి సూర్యపేట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొంది మొదటి సంవత్సరం చదవడానికి సిద్ధమవుతోంది. ఇద్దరూ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించి తమకు గుర్తింపు ఇవ్వడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంజేశారు.
ఆటో డ్రైవర్ కూతురికి ఉత్తమ ర్యాంక్
నేరడిగొండ: తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూనే కూతురి చదువుకు ఎలాంటి లోటు రానివ్వలేదు. తండ్రి కష్టానికి తన పట్టుదల, ప్రతిభను జోడించిన మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే వైష్ణవి నీట్లో మంచి ర్యాంక్తో ఎంబీబీఎస్ సీటు సాధించింది. బొందిడి గ్రామానికి చెందిన జైపాల్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా వైష్ణవిని ఉన్నత చదువులు చదివించారు. దీంతో వైష్ణవి కష్టపడి చదివి నీట్ ఫలితాల్లో 1,90,000 ర్యాంక్, ఎస్టీ కేటగిరీలో 334వ ర్యాంక్ సాధించింది. నిర్మల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది. మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన వైష్ణవి పరిమిత వనరులతో వైద్య విద్యలో సీటు సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


