సమస్య తీరదు.. రాక తప్పదు!
మంచిర్యాలఅగ్రికల్చర్: మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నా కలెక్టరేట్కు వచ్చేవారి సంఖ్య తగ్గడం లేదు. కలెక్టర్కు చెప్పుకుంటేనైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందని వస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వందలాది రూపాయలు చార్జీలు పెట్టుకుని వస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. అయినా పరిష్కారం లభించకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. భూ సమస్యలు, పింఛన్లు, పరిహారం, సర్టిఫికెట్లు, రోడ్డు, విద్యుత్ తదితర సమస్యలపై ప్రతీ వారం 60నుంచి 70 ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో 30శాతం కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో పదే పదే ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూ గోడు వెల్లబోసుకుంటున్నారు. పరిష్కారం లభిస్తుందనే భరోసా కూడా లభించకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రజావాణి అర్జీలపై మూడు నెలలకోసారైనా జిల్లా అధికారులు సమీక్షించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి అర్జీదారుకు ఐడీతోపాటు రశీదు ఇస్తున్నారు. నెలల తరబడి తిరుగుతున్నా పరిష్కారం లభించడం లేదు. ప్రతీ సోమవారం ప్రజావాణికి వస్తున్న అర్జీలు, పరిష్కారాలపై వివరాల కోసం సంబంధిత సూపరింటెండెంట్ను సంప్రదించగా స్పందించలేదు.
సత్వరమే పరిష్కరించాలి
మండల, జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో అందిన అర్జీలు పూర్తి స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, డీఆర్డీవో మోతీరాంతో కలిసి అర్జీలు స్వీకరించారు.


