రామకృష్ణాపూర్: చెన్నూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కావాలని ఆపుతున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజాప్రతినిధులు మారినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాల్సిన అవసరముందన్నారు. క్యాతనపల్లిలోని తన నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయించినప్పటికీ పనులు నిలిపివేశారని, చెన్నూర్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, మరో రెండు కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించిన జీవోలు తీసుకువచ్చినా వాటిని పక్కన పెట్టారన్నారు. పనులు కొనసాగిస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఉద్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో మంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి, మూల రాజిరెడ్డి, సుదర్శన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


