చెన్నూర్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ లకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, గుడిసె లేని నియోజకవర్గంగా మార్చడమే నా ముందు న్న లక్ష్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గత ప్రభుత్వం సింగరేణిని గనులను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి జీవో విడుదలయ్యే విధంగా కృషి చేశామన్నారు. రామకృష్ణాపూర్లోని ఓసీపీకి ఫారెస్ట్ క్లియరెన్స్ మంజూరు చేయించి 5 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. 1200 మెగా ప వర్ ప్లాంట్ తీసుకురావడంతో యువతకు మరో 5 వేల ఉద్యోగ అవకాశాలు లభించా యన్నారు. టామ్కామ్లో ఉద్యోగాలు కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, సాంకేతిక శిక్షణ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత 50 వేల ఉద్యోగాల కల్పనే మిగిలి ఉందన్నారు. వెయ్యి రోజుల పాలన సందర్భంగా శనివారం మంత్రి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
సాక్షి: ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీలు? నెరవేర్చినవి?
మంత్రి: కాళేశ్వరం ముంపు బాధితులకు భరోసా, తాగునీరు, వైద్యం, రోడ్ల నిర్మాణాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చాం. ఎన్నికల్లో గెలిచిన మూడు నెలల్లోనే కాళేశ్వరం ముంపు బాధితులకు రూ.32 కోట్ల పరిహారం ఇప్పించాం. రూ.100 కోట్ల నిధులతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాం. చెన్నూర్ మండలంలోని సోమనపల్లిలో రూ.200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, నియోజకవర్గంలో రూ.100 కోట్లతో ట్యాంక్ల నిర్మాణం చేపడుతున్నాం. వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. అంబేడ్కర్ చౌరస్తా నుంచి పెద్ద చెరువు రావిచెట్టు వరకు రూ.6 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ చేపడుతున్నాం.
ఇంక నెరవేర్చాల్సినవి..
మంత్రి: చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నాం. యువత జపాన్ భాషాలో ప్రావీణ్యం పొందేలా శిక్షణ ఇస్తున్నాం. చెన్నూర్లో ఏటీసీ భవన నిర్మాణం చేపడుతున్నాం. యువత పోలీసు ఉద్యోగాలు సాధించేందుకు కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నూర్లో శిక్షణ ఇప్పిస్తున్నాం.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు
మంత్రి: అర్హులైన ప్రతీ నిరుపేదకు మధ్యవర్తిత్వం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. నియోజకవర్గంలో మొదటి విడతలో 2,500, రెండో విడతలో 2,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించాం. మైనార్టీ మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి మిషన్లు పంపిణీ చేశాం. రాబోయే పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపడుతున్నాం. ఆగస్త్యా గుండాన్ని టూరిస్ట్ స్పాట్గా ఏర్పాటు చేసేందుకు రూ.17 కోట్లు నిధులు కేటాయించాం. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం.
ప్రజలకు మీరిచ్చే భరోసా
మంత్రి: ప్రజలకు నిష్పక్షపాతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. చెన్నూర్ నియోజకవర్గంలో నిరుపేదలు వైద్య, విద్య, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ మూడింటిపై ప్రత్యేక దృష్టి సారించాం. పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి రూ.3.50 కోట్ల నిధులు మంజూరు చేయించాం. చెన్నూర్, కోటపల్లి, భీమారం మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం వంద పడకల ఆస్పత్రి త్వరలోనే అందుబాటులోకి తేస్తాం. ‘సమస్య మీది, పరిష్కారం నాది’ అనే విధంగా ప్రతీ వ్యక్తి సమస్య తెలుసుకుని పరిష్కరించేందుకు ఓపెన్ బాక్స్ ఏర్పాటు చేశా. ప్రజలు అందులో ఫిర్యాదులు వేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తా.


