జాగా, భూమి చెక్ చేసుకున్నారా? జిల్లాలో అనేక సర్వేనంబర్లు, ఇళ్లు ఆ జాబితాలోనే.. కొన్ని చోట్ల ప్రైవేటు ఆస్తులు, భూములు సైతం వినతులు ఇస్తే పరిశీలించి సరి చేసే అవకాశం
ఇది జిల్లా కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న నస్పూర్ పరిధిలోని టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో కాలనీ. ప్రస్తుతం ఈ కాలనీ మొత్తం 22ఏ నిషేధిత జాబితాలో ఉంది. ఇక్కడ ఉద్యోగ సంఘ సభ్యులకు అప్పటి రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇప్పటికే కాలనీ వెలిసింది. అయితే సర్కారు భూమిగా ఉన్న సర్వేనంబర్ 42లో ఉండడంతో ప్రస్తుతం నిషేధ జాబితాలో చేరింది.
జిల్లాలో బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామక్రిష్ణాపూర్, మందమర్రి పటణాల్లో అనేక ఇళ్లు నిషేధిత జాబితాలో చేరాయి. ఈ పట్టణాలు సింగరేణి, ప్రభుత్వ భూములతో విస్తరించి ఉన్నాయి. ఏళ్లుగా సింగరేణి భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న అనేకమందికి జీవో నంబర్లు 76తోపాటు 58, 59కింద రెగ్యులర్ అయ్యాయి. అయితే తమకు హక్కులు వచ్చాయని అంతా అనుకున్నారు. మళ్లీ ఇప్పుడు చాలా ఇళ్లు నిషేధిత జాబితాలో చేరాయి.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మీ ఇల్లు నిషేధితా జా బితాలో ఉందా? లేదా? అని సరి చూసుకున్నారా? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 1908 రిజిస్ట్రేషన్ చట్టం 22ఏ సెక్షన్ ప్రకారం భూములను నిషేధిత జాబితా లో చేర్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా రెవె న్యూ శాఖ అధికారులు మండలాల నుంచి వివరా లు సేకరించి జిల్లా ఉన్నతాధికారులకు పంపితే ఆపై ప్రభుత్వానికి జాబితా పంపారు. దీంతో వందలాది సర్వే నంబర్లు, వేలాది ఇళ్లు, ఎకరాలు నిషేధి త జాబితాలో చేరాయి. అంటే 22ఏ జాబితాలో ఉన్న భూములు, ఆస్తులు అమ్మడం, కొనడం నిషే ధం. అయితే కొన్ని చోట్ల పొరపాట్లు జరిగాయి. ప్ర భుత్వ, ప్రైవేటు పక్కనే ఉన్న సర్వేనంబర్లు ఉన్నవి, చెరువులు, కుంటలు, నాలాలు, శిఖం పక్కన, కోర్, బఫర్ పరిధిలో ఉన్నవి, సర్కారు భూములు రెగ్యులర్ చేసుకున్నవి ఉన్నాయి. దీంతో ప్రైవేటు పట్టా భూములు, ప్రభుత్వ నిబంధనల మేరకు రెగ్యులర్ అయిన భూములు కూడా ఉన్నట్లుగా పరిశీలించా ల్సి ఉంది. జిల్లాలో ఇప్పటికే పలువురు తమ భూ ములు నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ తహసీ ల్దారు కార్యాలయాల్లో వినతులు ఇస్తున్నారు. వాటి ని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇలా చెక్ చేసుకోవచ్చు
స్థానిక తహసీల్దార్ కార్యాలయాలను సంప్రదించి వివరాలు తీసుకోవచ్చు. అంతేకాక ఆన్లైన్లో తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్(ఐజీఆర్ఎస్) శాఖ వెబ్సైట్ సందర్శించాలి. అక్కడ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఆప్షన్ను ఎంచుకోవాలి. అందులో జిల్లా, మండలం, గ్రామం/పట్టణం వారీగా ఎంపిక చేసుకోవాలి. ఇందులో మళ్లీ వ్యవసాయ, 22(ఏ) 1ఏ నుంచి 22ఏ1(ఈ), కోర్టు కేసుల భూముల వరకు ఉంటాయి. వ్యవసాయేతర భూములైతే అదే విధంగా 22ఏ1(ఏ) నుంచి 22ఏ(1)ఈ వరకు, అలాగే కోర్టు ఇతర భూములు ఉంటాయి. ఎవరైనా భూములు ఈ పరిధిలో ఉంటే పరిశీలించుకున్నత తర్వాత తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రాలు ఇవ్వొచ్చు. అక్కడ వక్ఫ్, దేవాదాయ, ఏవైనా కమిటీల సంబంధించిన భూములైతే ఆయా శాఖల అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సమస్య పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబరు 180059 94788 లేదా వాట్సాప్నంబరు 8247619983కు ఫిర్యాదు చేయొచ్చు.
ఎక్కడెక్కడ ఉండే అవకాశం
జిల్లాలో అనేక భూములు సర్కారుకు చెందిన పలు కేటగిరీలో ఉన్నాయి. ప్రభుత్వ, సింగరేణి, పొరంబోకు, భూదాన్, సీలింగ్, ఇనాం, అసైన్డ్, అటవీ, వక్ఫ్, దేవాదాయ, సాగునీటి కాలువలు, శిఖం, భూ సేకరణ జరిగినవి, ఆర్ఆర్ కాలనీలు, తదితర పరిధిలో ఉన్న భూముల్లో ఉన్నవి నిషేధిత జాబితాలో ఉండే అవకాశం ఉంటుంది. వాటి పక్కనే ఉన్న సర్వేనంబర్ల భూములు సైతం కొన్ని చోట్ల పొరబాటున ఆ జాబితాలో నమోదయ్యాయి. ఇక మున్సిపాలిటీ, పంచాయతీలకు ప్లాటింగ్ చేసిన సమయంలో మార్టిగేజ్ చేసిన స్థలాలు, వెంచర్లు, ప్రైవేటు బిల్డింగ్లు సైతం ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ చాలామంది తమ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయో లేవో కూడా తెలుసుకోలేని వాళ్లు కూడా ఉన్నారు.


