దండేపల్లి: ప్రస్తుత వానాకాలం సీజన్లో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్నాలు సాగు చేయడంతోపాటు విత్తన వివరాలను ‘టీ–అగ్రీసీడ్స్’ పోర్టల్లో నమోదు చేస్తేనే ప్రభుత్వం అందించే బోనస్ క్వింటాలుకు రూ.500 వర్తిస్తుంది. రైతులు కొనుగోలు చేసిన సన్నరకం వరి విత్తనాల వివరాలను సెప్టెంబర్ 10లోగా డీలరు వద్ద పోర్టల్లో నమోదు చేసుకోవాలని గడువు విధించింది. దీంతో రైతులు వివరాలు నమోదు చేసుకుంటున్నారు. మరో వైపు సాగు పనులు ముమ్మరంగా సాగుతుండటంతో కొందరు శ్రద్ధ చూపడం లేదు. సొంత విత్తనాలు, ఇతర రైతుల నుంచి విత్తనాలు పొందిన రైతులు ఏఈవోకు స్వీయ ధ్రువీకరణ పత్రం అందించి ఆన్లైన్ నమోదు చేసుకోవాలి. విత్తనాలు విక్రయించిన డీలర్లు రైతు పేరు, మొబైల్ నంబర్తోపాటు విత్తన రకం, ఎన్ని బస్తాలు, కంపెనీ పేరు, లాట్ నంబర్, బిల్ నంబర్ తదితర వివరాలన్నీ పోర్టల్లో నమోదు చేస్తున్నారు.
తప్పనిసరిగా చేసుకోవాలి
ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్నాలతోపాటు జైశ్రీరాంలోని ఇతర రకాలు సాగు చేసిన రైతులు తప్పనిసరి ఆన్లైన్ చేసుకోవాలి. డీలర్ల వద్ద కొనుగోలు చేస్తే వారివద్దకు వెళ్లి ఆన్లైన్ చేయించుకోవాలి. ఆన్లైన్ చేసుకుంటేనే ప్రభుత్వం అందించే బోనస్ వస్తుంది.
–గొర్ల అంజిత్కుమార్, ఏవో, దండేపల్లి
స్వీయ ధ్రువీకరణ
ప్రభుత్వం సూచించిన తెలంగాణ సోనా(ఆర్ఎన్ఆర్–15048), సాంబా మసూరి(బీపీటీ 5204), కేఎన్ఎం–1638, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–7715 సన్నరకాలు ఉండగా, రైతులు డీలర్ల వద్ద కాకుండా సొంతగా తయారు చేసుకున్న జైశ్రీరాం రకానికి సంబంధించిన ఇతర రకాల విత్తనాలు, ఇతర రైతుల నుంచి పొందిన విత్తనాలతో సాగు చేశారు. ఈ విధంగా సాగు చే సిన రైతులు స్వీయ ధ్రువీకరణ దరఖాస్తును స్థానిక ఏవోలకు అందజేస్తే సరిపోతుందని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ తెలిపారు.


