భైంసా: బాసర గోదావరి నదిలో మరో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు పుణ్యస్నానానికి వెళ్లి నీటమునిగి మృత్యువాత పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో బాసర గోదావరిలో భద్రతా లోపాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రతీ ఏడాది ప్రమాదాలు జరుగుతున్నా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించడం, అనంతరం పరిస్థితి మళ్లీ ఎప్పటిలాగే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
గతేడాది ఐదుగురు..
గతేడాది జూన్ 15న గోదావరి నదిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నీటి మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరు రాజస్థాన్కు చెందినవారు కాగా, ఈ కుటుంబం హైదరాబాద్లో స్థిర పడింది. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన 30 మంది బృందం ఇంటర్సిటీ రైతులో బాసరకు చేరుకుంది. ఇసుక దిబ్బ నుంచి నీటిలో స్నానాలు చేస్తూ ప్రమాదవశాత్తు రాథోడ్ రాకేశ్, భరత్, మదన్, వినోద్, రుతిక్ మృతిచెందారు. ఈ ఘటన మరువకముందే ఇప్పుడు మరో ముగ్గురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఏటా బాసరకు లక్షలాది మంది భక్తులు వస్తున్నప్పటికీ నదీ తీరంలో శాశ్వత భద్రతా ఏర్పాట్లు మాత్రం లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు నది పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు తక్కువగా ఉండటంతో పాటు నిత్యం విధుల్లో ఉండే లైఫ్గార్డుల సంఖ్య కూడా సరిపడా లేదని తెలుస్తోంది. పండుగలు, సెలవు దినాలు, వారాంతాల్లో భారీగా భక్తులు వచ్చే సమయంలో ప్రత్యేక నిఘా అవసరమని భక్తులు భావిస్తున్నారు.
భక్తుల ప్రధాన డిమాండ్లు


