శ్రీరాంపూర్: సీసీసీలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీ పూర్వ విద్యార్థిని మంచాల అక్షయ ఉత్తమ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది. 2020–23లో ఇక్కడ సివిల్ డిప్లొమా కోర్సు చదివిన ఆమె అనంతరం కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసింది. ఇటీవల హెచ్ఎస్బీలో రూ.16.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం కాలేజీలో అక్షయను ప్రిన్సిపల్ కుర్మ రాజేందర్, డీజీఎం (పర్సనల్) అనిల్కుమార్ అభినందించారు. సింగరేణి పాలిటెక్నిక్ కాలజీ మంచి విద్యాప్రమాణాలతో కొనసాగుతుందనడానికి ఇది నిదర్శనమని వారు తెలిపారు.
పారిశుధ్య కార్మికుడి మృతి
భైంసాటౌన్: పట్టణంలోని మున్సిపాలిటీ పారి శుధ్య విభాగంలో పని చేస్తున్న జంగ్మే మారుతి (45) గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతి కొన్నేళ్లుగా మున్సిపాలిటీలో పారిశుధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండురోజులుగా విధులకు హాజరుకావడం లేదు. మంగళవారం సాయంత్రం గడ్డెన్నవాగు ప్రాజెక్టులో అతడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సుకేశ్న బాయి, ఇద్దరు కొడుకులున్నారు.
వడదెబ్బతో ఒకరు మృతి
ఆసిఫాబాద్రూరల్: వడదెబ్బతో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని రాజురా గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజురా గ్రామానికి చెందిన పిప్రే మోహన్ (40) ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.


