సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
మంచిర్యాలక్రైం/బెల్లంపల్లి/రామకృష్ణాపూర్: ఈ నెల 11న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం ఆయన జిల్లాలోని బెల్లంపల్లి, క్యాతనపల్లి మున్సిపాల్టీల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. వసతులు, భద్రత ఏర్పాట్లపై తెలుసుకున్నారు. మంచిర్యాల కార్పొరేషన్లోని 60 డివిజన్లలో పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించాలని తెలిపారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పార్టీల కార్యకర్తలు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాష్, సీఐ ప్రమోద్రావు, బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్, మున్సిపల్ కమిషనర్ జే.సంపత్, వన్టౌన్ ఎస్హెచ్ఓ కే.శ్రీనివాసరావు, మందమర్రి సీఐ రమేష్, ఎస్సైలు పాల్గొన్నారు.
భయం వీడి ఫిర్యాదు చేయండి
మంచిర్యాలక్రైం: భయం వీడి ఫిర్యాదు చేస్తేనే మహిళల భద్రతకు పోలీసు భరోసా లభిస్తుందని సీపీ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసినా, మెస్సేజ్ చేసినా క్షణాల్లో పోలీసులు మీ వద్దకు చేరుకుని రక్షణ కల్పిస్తారని పేర్కొన్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం షీటీమ్స్ నిరంతరంగా సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఎవరైనా వేధిస్తే వెంటనే షీ టీమ్ వాట్సాప్ నంబరు 63039 23700లో సంప్రదించాలని కోరారు. జనవరిలో షీ టీమ్స్కు 56 ఫిర్యాదులు అందాయని, 43 రెడ్ హ్యాండెడ్ కేసులు డెకాయ్ ఆపరేషన్లలో నమోదు అయ్యాయని తెలిపారు.


