ఆర్జీయూకేటీలో బీఎఫ్ఎస్ఐ ప్రోగ్రాం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకోసం సోమవారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ (బీఎఫ్ఎస్ఐ) అధికారికంగా ప్రారంభించారు. మొదటి విడతలో మొత్తం 156 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో బీఎఫ్ఎస్ఐ రంగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ మైనర్ డిగ్రీ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ కోర్ సబ్జెక్టులతో పాటు ఆర్థిక, విశ్లేషణాత్మక, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు. విద్యార్థులు తమ కెరీర్ను మెరుగుపర్చుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఓఎస్డీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ మురళీ దర్శన్, అసోసియేట్ డీన్ (అకడమిక్స్ అండ్ ప్లానింగ్) శేఖర్ శీలం, అసోసియేట్ డీన్ (సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్) డాక్టర్ ఎస్.విఠల్, డాక్టర్ స్వాతి, జి.స్వప్నిల్, చరణ్ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


