అనుమానాస్పదస్థితిలో ఒకరు మృతి
నేరడిగొండ: అనుమానస్పదస్థితిలో బావిలో పడి ఒక రు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లఖంపూర్ గ్రామానికి చెందిన అర్క భీంరావు (38) తన భార్యతో కలిసి నిర్మల్ జిల్లా మామడ మండలం రాయదారిలో నివాసం ఉంటున్నాడు. దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఇచ్చోడలో చదువుతుండగా, చిన్న కుమారుడు అర్క భీంరావు నానమ్మ, తాతయ్యతో కలిసి లఖంపూర్లో ఉంటున్నాడు. శుక్రవారం ఇచ్చోడలోని పెద్ద కుమారుడును చూసిన భీంరావు చిన్న కుమారుడిని చూసేందుకు లఖంపూర్ వచ్చాడు. అదేరోజు రాత్రి అతని తమ్ముడు లక్ష్మణ్ నేరడిగొండ బస్టాప్లో దించివెళ్లాడు. సోమవారం ఉదయం ఒక హోటల్ సమీపంలో దుర్వాసన రావడంతో యజమాని అక్కడికి వెళ్లి చూడగా బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


