ప్రచారం షురూ..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో కీ లక ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలు, పరిశీ లన, ఉపసంహరణ ప్రక్రియల తర్వాత బరిలో మి గిలిన అభ్యర్థుల సంఖ్య తేలింది. తుదిగా పోటీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. దీంతో అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. ఇప్పటికే సోషల్మీడియాలో ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రచార రథాలతో ప్రత్యే క పాటలు, నినాదాలతో గల్లీల్లో హోరెత్తిస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో ఇంటింటా ప్రచారం మొదలు పెట్టారు. మంగళవారం వరకు ‘బీ ఫాం’లపై పంపిణీపై కొంత సందిగ్ధం నెలకొనగా, సాయంత్రం గుర్తులు కే టాయించిన నుంచి అభ్యర్థులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. ప్రత్యర్థులెవరో తేలిపోవడంతో పోటాపోటీగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యా రు. ఈ నెల 9వ తేదీ వరకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉండడంతో ఈ మేరకు ప్రతీ ఓటరు ను కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తమ పార్టీ టికెట్ దక్కడంతో గెలుపే లక్ష్యంగా రూ.లక్షల్లో ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఉపసంహరణకు బేరసారాలు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో పోటీగా నామినేషన్లు వేసిన వారితో పలువురు రెండురోజులుగా మంతనాలు జరిపారు. ఉపసంహరణ చివరిరోజు మధ్యాహ్నం వరకు వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పలు వార్డుల్లో హైడ్రామా కొనసాగింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు, లక్సెట్టిపేట మున్సిపాలిటీకి అధికార కాంగ్రెస్ ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కాగా, బీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థుల్లో ‘బీ ఫాం’ కేటాయింపులపై అంతర్గతంగా విబేధాలు తలెత్తాయి. బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ‘బీ ఫాం’ విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. మిగతా మున్సి పాలిటీల్లో స్వతంత్రులు, సొంత పార్టీలో రెబెల్స్ను తప్పించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు విశ్వప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొన్నిచోట్ల పలువు రు పోటీలోనే ఉన్నారు. దీంతో జిల్లాలోని ఏ మున్సి పాలిటీలోనూ ఒక్క వార్డు ఏకగ్రీవం కాలేదు.
చివరి గంటలో ‘బీ ఫాం’లు
మంచిర్యాల మున్సిపాల్ కార్పొరేషన్లోని 60డివిజన్లలో వివిధ పార్టీల నుంచి అభ్యర్థిత్వం ఖరారైనవారు స్వతంత్రులతో నామినేషన్ల విత్ డ్రా చేయించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. మంచిర్యాలలో కార్పొరేటర్గా నామినేషన్ వేసినవారికి మధ్యాహ్నం 2గంటల వరకు ‘బీ ఫాం’లు అందజేశారు. ఇక అధికార పార్టీని అనురిస్తూ ప్రతిపక్ష పార్టీల నుంచి పలు వార్డుల్లో అభ్యర్థులు మంతనాలు జరి పారు. బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి, బీజేపీ నుంచి డివిజన్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకొన్నారు. చివరి క్షణంలో కొందరు అభ్యర్థులు విత్డ్రా కోసం రాగా, మూడు గంటల సమయం దాటిపోయిందని అధి కారులు అనుమతించలేదు. నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో అనివార్యంగా వారు బరిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొత్తులో భాగంగా మంచిర్యాలలో సీపీఐ నుంచి ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్ వేయగా చివరికి ఒక్క స్థానమే కేటాయించడంతో మిగతావారు పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని మొత్తం 22వార్డుల్లో ఎనిమిది స్థానాలు సీపీఐకి పొత్తులో అప్పగించగా, ఒక చోట బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకోలేదు. అయితే 14వార్డుల్లో బీఆర్ఎస్ పోటీలో ఉన్నప్పటికీ విత్ డ్రా చేసుకోని అభ్యర్థికి పార్టీ నుంచి ‘బీ ఫాం’ ఇవ్వలేదు. బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు పార్టీలో కష్టపడిన వారికి ‘బీ ఫాం’లు ఇవ్వలేదని తాను రాజీనామా చేస్తానని ప్ర కటించారు. పలుచోట్ల పార్టీ టికెట్లు దక్కని ఆశా వహులు ఆగ్రహంతో రగులుతున్నారు.
మంచిర్యాల బరిలో 240మంది
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా 122మంది నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇందులో బీజేపీ నుంచి 48 మంది, బీఆర్ఎస్ నుంచి 37మంది, కాంగ్రెస్ నుంచి 14మంది, ఆప్, బీఎస్పీ నుంచి ఒక్కొక్కరు, స్వతంత్రులు పది మంది, సీపీఐ నుంచి ఏడుగురు, ఏఐఎఫ్బీ నుంచి నలుగురు విత్ డ్రా చేసుకున్నారు. మొత్తంగా 240మంది బరిలో ఉన్నారు. అంటే.. సగటున ఒక్కో డివిజన్లో నలుగురు చొప్పున పోటీలో ఉన్నారు. అత్యల్పంగా 54డివిజన్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరే పోటీలో ఉండడం గమనార్హం. ఐదో డివిజన్ నుంచి నుంచి అత్యధికంగా ఏడుగురు బరిలో నిలిచారు.


