మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ సిస్టంలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లేదని ఎస్పీ జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతలు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల ప్రకారం శబ్ద కాలుష్య నియంత్రణపై ప్రతిఒక్కరికి బాధ్యత ఉందన్నారు. జిల్లాలో ఉన్న డీజే ఆపరేటర్లు పోలీసుల సూచనలు తప్పక పాటించాలన్నారు. అనుమతి లేకుండా డీజే వినియోగించడం, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే డీజే ఆపరేటర్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఊరేగింపుల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ వైర్లు, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు. మద్యం తాగి ఊరేగింపుల్లో పాల్గొనడం, ఇతరులకు ఇబ్బందులు కలిగించడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎవరైనా అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేసిన పరిస్థితులు ఏర్పడితే సెల్ నం.87126 59360, లేదా 112కి సమాచారం ఇవ్వాలని కోరారు.
నీటి లీకేజీలను
వెంటనే అరికట్టాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నీటి లీకేజీ సమస్యను వెంటనే అరికట్టాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. ఆదివారం ఆయన నగరంలోని పోలీస్ లైన్ స్కూల్ సమీపంలో, షాసాబ్గుట్ట ప్రాంతంలో నీటి లీకేజీ సమస్యను పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నీటి లీకేజీని గుర్తించిన ఆయన సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఏఈని ఆదేశించారు. లీకేజీకి గల కారణాలను గుర్తించి, తక్షణమే మరమ్మతు చేపట్టి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సరఫరా వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.


