పాలమూరు: ఈనెల 17న దేశ ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా అదేరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆశీస్సుల దీపం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మోదీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని దేశానికి మరింత సేవ చేయాలనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ఎదుట ఆశీస్సుల దీపం వెలిగించాలని కోరారు.
బ్రహ్మోస్ భూసేకరణపై రైతులతో సమావేశం
దేవరకద్ర: బ్రహ్మోస్ యూనిట్ ఏర్పాటు కోసం చేపడుతున్న భూసేకరణ పక్రియలో భాగంగా మంగళవారం ఆర్డీఓ నవీన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం రైతులతో సమావేశం నిర్వహించి చర్చించారు. భూసేకరణకు సంబంధించిన అంశాలపై రైతుల అభిప్రాయాలను, అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రైతుల వారీగా చెప్పిన అభిప్రాయాలను నమోదు చేసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హర్షద్, ఆర్ఐ శరత్, సర్పంచ్ శివకుమార్, సర్వేయర్, రైతులు పాల్గొన్నారు.
ఖేలో ఇండియాకు
‘యోగా’ సెలక్షన్ ట్రయల్స్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జిల్లాస్థాయి యోగా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు హైదరాబాద్ యూసుఫ్గూడలోని కేవీబీఆర్ ఇండర్ స్టేడియంలో ఈనెల 17న (బాలుర), 18న (బాలికల) రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా యోగా సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొంటారని జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఆయా తేదీల్లో ఉదయం 8.30 గంటలకు పోటీ ప్రాంగణంలో రిపోర్టు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ కె.ఆనందం, సీనియర్ అసిస్టెంట్ పి.రవీందర్రెడ్డి, డీఎస్ఏ యోగా కోచ్ కె.సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.


