వారి ప్రోద్బలంతోనే దాడి..
● తారాస్థాయికి చేరిన భాగాల
పంచాయితీ
● ఆదాయంలో వాటా కావాలని
ఇరువర్గాల ఘర్షణ
● రూరల్ పోలీస్ స్టేషన్లో పలువురిపై కేసులు నమోదు
మహబూబ్నగర్ క్రైం: ఒక సొసైటీలోని రెండు వర్గాల మధ్యలో ఉన్న అంతర్గత భేదాలు భగ్గుమన్నాయి. దీంతో గత 48 గంటల నుంచి వెంకటాపూర్ కల్లు డిపో దగ్గర హైడ్రామా సాగుతుంది. కల్లు డిపో పరిధిలో ఉన్న 15 దుకాణాల ద్వారా వచ్చే ఆదాయంపై తమకంటే.. తమకు భాగాలు (వాటా) కావాలంటూ రెండు రోజుల నుంచి రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం ఉదయం పాతవర్గం అంటూ చెప్పుకొనే వారిలో దాదాపు వందమంది వరకు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి తర్వాత నూతనంగా ఎంపికై న సొసైటీ వాళ్లు అక్కడికి చేరుకోగా.. ఎవరికి వారు అనుకూలంగా నినాదాలు చేసుకున్నారు. ఘటనా స్థలానికి రూరల్ పోలీసులు చేరుకోగా ఎస్ఐ విజయ్కుమార్కు రెండు వర్గాలు రాత పూర్వకంగా ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆందోళన చేస్తున్న వారిలో 14 మందిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. అక్రమంగా కల్లు డిపో లోపలికి ప్రవేశించి, దాడులు చేయడానికి ప్రయత్నించారనే అంశంపై సొసైటీ అధ్యక్షుడు శరత్బాబుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మురళీధర్గౌడ్తోపాటు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మరోవైపు మురళీధర్గౌడ్ సైతం కల్లు డిపోలో కల్లు తయారీ చేయకుండా విచారణ చేయాలనే దానిపై వినతిపత్రం ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు.
ఎకై ్సజ్ శాఖ ఏం చేస్తోంది..
సొసైటీ ఎన్నికల నిర్వహణతోపాటు కల్లు దుకాణాల పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రెండు రోజుల నుంచి రెండువర్గాల మధ్య గొడవ జరుగుతుంటే తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈఎస్ సంతకం ఫోర్జరీ చేశారనే విషయాన్ని మహబూబ్నగర్ ఈఎస్ సుధాకర్ను ‘సాక్షి’ వివరణ కోరగా మా సంతకాలు ఎవరూ ఫోర్జరీ చేయలేదని, కల్లు డిపో వ్యవహారం పూర్తిగా వారి అంతర్గత విషయం అని చెప్పడం గమనార్హం.
రెండు నెలల కిందట ఎన్నికలు
వెంకటాపూర్ కల్లు డిపో నూతన సొసైటీ కోసం జూలై 4న టీఎన్జీఓ భవనంలో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో శరత్బాబుగౌడ్ ప్యానెల్ గెలుపొందింది. ఇందులో అప్పటి వరకు 23మంది సభ్యులు ఉండగా మరో 13 మందిని కూడా కలిపే వరకు ఎన్నికలు నిర్వహించరాదని కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకువస్తే వాటిని పట్టించుకోకుండా ఎకై ్సజ్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఎన్నికలు జరిపారని మరోవర్గం ఆరోపిస్తోంది. ట్యాపింగ్ టెస్ట్ అడ్డుకొని వారికి నచ్చినట్లు ఎన్నికలు నిర్వహించారని చెప్పుకొచ్చారు. రాజకీయ నేతల ప్రమేయంతో పాత వర్గానికి వాటా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
మాజీమంత్రితోపాటు మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రోద్బలంతోనే సొసైటీలో కల్లు తయారీ అడ్డుకొని దాడి చేయడానికి వచ్చారని ప్రతాప్గౌడ్ ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తనపై గిట్టక మాజీ మంత్రి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి అడ్డుకోవడానికి పంపించారని చెప్పారు. ఎకై ్సజ్ శాఖ ఈఎస్ సంతకంతోపాటు స్టాంపులు ఫోర్జరీ చేశారని దీనికి సంబంధించి 13 మందిపై ఫోర్జరీ కేసులు నమోదవుతున్న క్రమంలో ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి వెంకటాపూర్ డిపో మీదకు దాడికి వచ్చారని ఆరోపించారు. సొసైటీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రెండు నెలలపాటు వారికే సమయం ఇచ్చి.. ఆ తర్వాత తమ ఆధీనంలోకి డిపోను తీసుకుని కల్లు తయారీ ప్రారంభించిన మొదటిరోజే దాడికి రావడం సరికాదన్నారు. కుల పెద్దలతో కూర్చొని మాట్లాడి ఉంటే బాగుండేదని అలా కాకుండా కల్లు తయారీ అడ్డుకొని దాడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.


