● మంటలు చెలరేగి క్లీనర్
సజీవ దహనం.. 270 మేకలు మృతి
● భూత్పూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
భూత్పూర్: అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగా మేకల లోడ్ వెళ్తున్న లారీ హైవేపై సూచికల బోర్డును ఢీకొట్టిన ఘటన భూత్పూర్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నుంచి డ్రైవర్ రషీద్ క్లీనర్ అమిత్కుమార్, ఇద్దరు కూలీలు అబ్దుల్ బారి, ఇస్తికర్తో కలిసి 270 మేకలను బెంగుళూరుకు డీసీఎంలో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 4:40 గంటల ప్రాంతంలో డీసీఎం భూత్పూర్ సమీపంలోని జాతీయ రహదారిపై రాష్ట్రాలు, కిలోమీటర్ల దూరాన్ని సూచించే సూచికల బోర్డు దిమ్మెను వేగంగా ఢీకొట్టడంతో బోల్తాపడింది. వెంటనే మంటలు చెలరేగాయి. డీసీఎంపైన ఉన్న క్లీనర్ అమిత్కుమార్ (32)తో పాటు 270 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. డ్రైవర్ రశీద్, అబ్ధుల్ బారి, ఇస్తికర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహయక చర్యలు చేపట్టగా.. రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను పూర్తి నియంత్రించాయి. మృతుడు అమిత్కుమార్ చిన్నాన్న దయాశంకర్ ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్ రషీద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగయ్య తెలిపారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జానకి
భూత్పూర్ సమీపంలో జాతీయ రహదారి–44పై జరిగిన ప్రమాద ఘటన స్ధలాన్ని ఎస్పీ జానకీ పరిశీలించారు. ప్రమాద పరిస్థితులను, సహాయక చర్యలను సమీక్షించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, టూటౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ఉద్దీన్, భూత్పూర్ ఎస్ఐ నాగన్న, మూసాపేట ఎస్ఐ వేణు, అగ్నిమాపక సిబ్బంది, స్ధానిక పోలీసులు ఉన్నారు.


