● ఐదుగురికి గాయాలు
● మద్యం మత్తులో డ్రైవర్
మహబూబ్నగర్ క్రైం: ఓవర్ లోడ్.. పైగా మద్యం మత్తులో డ్రైవర్, అతివేగం వెరసి ప్రైవే ట్ స్కూల్ వాహనం బోల్తాపడిన ఘటనలో విద్యార్థులకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కోయిలకొండ మండలంలోని ఇంజమూర్లో శివ, కల్పన ప్రాథమిక పాఠశాల నడుపుతున్నారు. బుధవారం పాఠశాల ముగిసిన తర్వాత డ్రైవర్ రాజు టాటా మ్యాజిక్ వాహనంలో 30 మంది విద్యార్థులను ఎక్కించుకొని బయలుదేరాడు. ఈ క్రమంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో పాటు అతివేగంగా నడపడంతో వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్నారి సాయికార్తీకకు చేయి ఫ్యాక్చర్ కాగా.. చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురు విద్యార్థులను కోయిలకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలాన్ని రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్ఐ నాగరాజు పరిశీలించారు. డ్రైవర్ రాజుతో పాటు స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.


