చారకొండ: సీర్సనగండ్ల దేవాలయ సంబంధిత భూములు సాగుచేస్తున్న రైతులు కౌలు చెల్లించాలని దేవాదాయ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు తెలిపారు. మండలంలోని సీర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయం ప్రాగణంలో బుధవారం ఆలయ భూములు సాగుచేస్తున్న కౌలు రైతులతో ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ రంగాచారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా, మండలంలోని అగ్రహారం తండా, గైరాన్తండా, సీర్సనగండ్ల తదితర గ్రామాల కౌలు రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ మట్లాడుతూ.. ఆలయ భూముల సాగుచేస్తున్న రైతులు తప్పనిసరిగా కౌలు చెల్లించాలని వివరించారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులు ఎకరాకు ఏడాదికి రూ.500 చెల్లించేందుకు ముందుకు రావడంతో దీనిపై తీర్మానం చేసి నిర్ణయించారు. దేవాదాయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో సమావేశం ఏర్పాటు చేసి కౌలు నిబంధనలు తదితర వాటిపై పూర్తి వివరాలు తెలియజేస్తామని సహాయ కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ మాజీ ఈఓ ఆంజనేయులు, ఆయా దేవాలయాల ఈఓలు జైపాల్రెడ్డి, ప్రసాద్, సత్యచంద్రారెడ్డి, ఆలయ మేనేజర్ నిరంజన్, అర్చకులు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు.


