● పాఠశాల, పల్లె దవాఖానా, అంగన్వాడీ కేంద్రాల తనిఖీ
● మెనూ పాటించకపోవడంతో షోకాజ్ నోటీసులకు ఆదేశం
భూత్పూర్ (అడ్డాకుల): మూసాపేట మండలం వేములలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. జడ్పీ ఉన్నత పాఠశాల, పల్లె దవాఖాన, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యాబోధన, ఉపాధ్యాయు లు, విద్యార్థుల హాజరు, పదో తరగతి విద్యార్థుల మార్కుల నమోదును పరిశీలించారు. విద్యార్థులు గణితంలో పట్టు సాధించాలని సూచించారు. సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లను, అక్షయపాత్ర ద్వారా అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థిని మాధురి రచించిన ‘శతక మధురిమ’ పుస్తకాన్ని ఆవిష్కరించి అభినందించారు. పల్లె దవాఖానలో రోజువారీగా వచ్చే రోగుల సంఖ్య, నమోదవుతున్న అనారోగ్య సమస్యలు, అందుతు న్న వైద్యసేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. అంగన్వాడీ కేంద్రంలో మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అని పరిశీలించగా.. ఎగ్ బిర్యానీకి బదులు అన్నంలో గుడ్డు కలిపి అందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
జిల్లాలో గుర్తించిన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఖుష్బూగుప్తా తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 26న ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థులకు పర్యాటక ప్రాంతాల సందర్శన, వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కోయిల్కొండ మండలం రాంకొండను బెస్ట్ టూరిజం విలేజ్గా అభివృద్ధి చేసి ఫిల్మ్ షూటింగ్లకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జడ్చర్లలో హెరిటేజ్, టూరిజం ప్లాజాల ఏర్పాటుకు పీపీపీ విధానంలో ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ వీసీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జిల్లా టూరిజం అధికారి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.


