జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉప సర్పంచ్లకు ఇచ్చిన చెక్ పవర్ను వెంటనే రద్దు చేయాలని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకట్రాములుగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు విడుదల చేయాలని, గ్రామ పంచాయతీల నిధుల ఫ్రీజింగ్ ఎత్తివేయాలని కోరారు. పంచాయతీ విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని, 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని, గ్రామసభ, సర్పంచ్ల అధికారాలను నిర్వీర్యం చేసే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ హరిప్రియకు వినతిపత్రం అందజేశారు.
తలసేమియాపై
సిబ్బందికి శిక్షణ
పాలమూరు: తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్, జిల్లా వైద్యారోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తలసేమియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ చీఫ్ మెడికల్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ జైన్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ పద్మ ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. సకాలంలో స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణ, అవసరమైన వైద్య సంరక్షణపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శంకర్, డాక్టర్ శివకాంత్ పాల్గొన్నారు.
ఎన్ఎస్యూఐకు
కొత్త సారథులు
● ఐదు జిల్లాలకు అధ్యక్షుల నియామకం
స్టేషన్ మహబూబ్నగర్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా ఽఅధ్యక్షుడిగా ఎ.శేఖర్, నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నల్లవెల్లి యశ్వంత్, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీకాంత్, జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా అవినాష్ యాదవ్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఎండీ అఫ్రోజ్ను నియమించారు. ఎన్ఎస్యూఐను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సూచించారు.
మహాధర్నా వాయిదా
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఈనెల 10న హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన మహాధర్నాను వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్రెడ్డి బుధవారం తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ఈనెల 18న సీఎం రేవంత్రెడ్డితో నాయకులు భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, సానుకూల నిర్ణయం రాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.


